ఉన్నతులకే ఉన్నత ఆలోచనలు: జగన్పై రాపాక పొగడ్తలు: అదంటే చంద్రబాబుకూ ఇష్టమే..!
అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. జగన్ ఆలోచనలు అత్యున్నతమైనవని, వాటిని అందుకోవడం సామాన్యులకు సాధ్యం కాదని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారికే ఉన్నతమైన ఆలోచనలు వస్తాయని ప్రశంసించారు. మధ్యలో చంద్రబాబు నాయుడికీ చురకలు అంటించారు.

అనుభవం కాదు.. చేయాలనే తపన..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై చర్చ సందర్భంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన వైఎస్ జగన్కు పరిపాలనా అనుభవం లేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్త పరిచారని, వాటన్నింటినీ పటాపంచలు చేశారని రాపాక అన్నారు. పరిపాలనకు కావాల్సింది అనుభవం కాదని, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలని చెప్పారు. ఆ తపన ఉండటం వల్లే వైఎస్ జగన్ అత్యున్నతమైన ఆలోచనలు చేస్తూ, పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

ప్రజల్లో ఓటింగ్ పెడితే.. ఫలితం గురించి చెప్పుకోనక్కర్లేదు..
మూడు రాజధానుల అంశంపై ప్రజల్లో ఓటింగ్ పెట్టాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారని, దాని ఫలితం ఎలా వస్తుందనేది ఆయనకు తెలియనది కాదని చెప్పారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఓటింగ్ పెట్టడం కాదు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈ ఓటింగ్ పెట్టాలని అన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు మూడు రాజధానుల అంశాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మరో మాటకు అవకాశమే లేదని రాపాక వరప్రసాద్ కుండబద్దలు కొట్టారు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా..
ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న నాయకుడెవరైనా సరే.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని రాపాక తేల్చి చెప్పారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా ప్రవర్తించే నాయకుడెవరూ రాజకీయాల్లో రాణించలేరని అన్నారు. సొంత అభిప్రాయాలు, స్వార్థ రాజకీయాలకు ఇక్కడ అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటున్నారని, వారి ఆలోచన, అభిప్రాయాలను, వారి ద్వారా ఎన్నుకున్న శాసనసభ్యుడిగా గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.

సొంతంగా ఆరా తీశా..
మూడు రాజధానుల అంశంపై తాను సొంతంగా ఆరా తీశానని, వ్యక్తిగతంగా చాలామంది ప్రజలతో మాట్లాడానని రాపాక తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు కావాలనే అభిప్రాయం ప్రతిపక్ష పార్టీకి అనుకూల ప్రాంతాల్లోనూ వ్యక్తమైందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తాను మాట్లాడుతున్నానని చెప్పారు. మూడు రాజధానులు ఏర్పాటు కావాలని, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని అన్నారు.

చంద్రబాబుకు కూడా ఇష్టమే..
మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే అంశం చంద్రబాబు నాయుడికి కూడా ఇష్టమేనని రాపాక వరప్రసాద్ అన్నారు. ప్రతిపక్ష నేత అయినందున.. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తే.. ఆయన మనసు మూడు రాజధానుల అంశం సానుకూలంగా ఉందని అన్నారు. వైఎస్ జగన్ చేసిన ఈ ఆలోచనను ఎవరూ కాదనలేరని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.

యువ ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు..
అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల వ్యవధిలో వైఎస్ జగన్.. ప్రతి రోజు కూడా పేదలకు మంచిని చేయాలని తపించారని రాపాక అన్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం- జగన్ వంటి యువ ముఖ్యమంత్రి చేతుల్లో ఉండటం గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా లక్షలాది మంది యువత జీవితాలకు జగన్ భరోసా కల్పించారని, వారికి ఒక మార్గదర్శకాన్ని చూపించారని అన్నారు.












Click it and Unblock the Notifications