Flash Back 2019: జనసేనకు చేదు అనుభవం.. ప్రచారంలో ప్రభంజనం.. ఫలితాల్లో ఘోర పరాభవం
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ, ప్రభంజనం సృష్టిస్తాం అని వచ్చిన పార్టీ, ప్రశ్నిస్తాం అని నినదించిన పార్టీ ప్రశ్నించటానికే మిగిలిపోయింది. 2019 జనసేనకు ఒక చేదు జ్ఞాపకాన్నే ఇచ్చింది. పార్టీ పెట్టి చాలా కాలం అయినా తొలిసారి ఎన్నికల బరిలోకి సమరోత్సాహంతో ఉరికిన జనసైనికులు చతికిలబడ్డారు. ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావటం తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురి చేసింది. 2019 జనసేనకు అసలు కలిసిరాలేదు.

ఎన్నికల ముందు నుండీ అష్టకష్టాలు పడుతున్న జనసేన
జనసేన పార్టీ స్థాపించి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుండి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తే తొలి నాటి నుండి జనసేన పార్టీ పై రకరకాల ప్రచారాలు పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాయి. జనసేన పార్టీ నాడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలాగే ఉంటుందని , నాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసినట్టే జనసేనాని కూడా పార్టీని ఎన్నికల తర్వాత విలీనం చేస్తారని రకరకాల ప్రచారాలు సాగాయి.

ఆది నుండీ జనసేనకు అన్నీ కష్టాలే .. అంతా దుష్ప్రచారమే
ఇక జనసేనతో పొత్తు కోసం కూడా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి సాగాలని పోత్తులకు ఆఫర్ కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిగానే బరిలోకి దిగారు. ఎన్నో రాజకీయాలను తట్టుకుని, దుష్ప్రచారాలను అధిగమించి ఎన్నికల్లో పోటీ చేసి ఫలితాలలో ప్రజాదరణ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉబలాటపడిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు.

రెండు చోట్ల ఓడిన పవన్ ... గెలిచిన ఏకైక అభ్యర్థి
ఒకే ఒక్క జనసేన అభ్యర్థిని గెలిపించారు. పవన్ గాజువాక, భీమవరం లలో పోటీ చెయ్యగా ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఇక పవన్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగిన వేళ పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చానని ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని గట్టిగానే చెప్పారు.ఇక అప్పటి నుండి నేటి వరాకు పార్టీని బలోపేతం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న పవన్ కు పార్టీలో కీలక నేతల వలసలు ఇబ్బందిని కలిగిస్తునాయి.

ఓడినా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్
అయినప్పటికీ పవన్ జనసేన పార్టీ అధినేతగా అధికార పార్టీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఇసుక కొరత సమయంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్నఏ నిర్ణయం పైన అయినా కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్తున్నారు. తెలుగు మీడియం రద్దు , కరకట్ట నిర్మాణాల కూల్చివేత తదితర నిర్ణయాలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అయితే పవన్ ఓటమి పాలు కావటం అధికార పక్షానికి ఆయుధంగా మారింది.

ఓటమిని, పవన్ వ్యక్తిగత జీవితాన్ని పదేపదే టార్గెట్ చేస్తున్నా జనసేనాని ఎదురీత
అధినేత అయ్యుండి ఒక్కస్థానంలో కూడా గెలవలేని పవన్ వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అంతే కాకుండా పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి విమర్శలు నేటికీ గుప్పిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. ఇక పార్టీ ఓటమి పాలైన నాటి నుండి పార్టీ నుండి బయటకు వెళ్తున్న నేతలు తప్ప పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రశ్నించే గొంతుక అని భావించిన జనసేన పార్టీ ఏపీలో ఉన్నా ఎన్నికల్లో ఓటమితో పార్టీపై ప్రజల అంచనాలు తారుమారు అయ్యాయని చెప్పొచ్చు. 2019 జనసేన చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని, తొలిసారి పోటీ చేసి ఘోర ఓటమి చవి చూసిందని చెప్పొచ్చు .












Click it and Unblock the Notifications