పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అని పోస్ట్ చేసిన కేశినేని నానీ.. ఇంతకీ పోరాటం అధినేతతోనేనా
పార్లమెంట్లో టీడీపీ విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని గురువారం నాడు ఫేస్బుక్లో మరో కామెంట్ పెట్టాడు. పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీ శ్రీ కవితను కోట్ చేస్తూ ఆయన కామెంట్ పెట్టాడు.పార్లమెంట్లో టీడీపీ విప్ పదవితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో ఈ పదవిని తీసుకోవడాని నాని విముఖత చూపినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక పక్క చంద్రబాబు ఫోన్ చేసి కేశినేని నానీని బుజ్జగించే ప్రయత్నం చేసినా నానీ మాత్రం తానూ పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఇంతకీ నానీ పోరాటం అధినేతపైనేనా ? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది.
చంద్రబాబు ఫోన్! ఉలకని, పలకని కేశినేని నాని!
పదవి విషయంలో అధినేతపై గుస్సా మీదున్న నానీ .. గల్లా పైనా నానీ గుర్రు
టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు తనకు ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పారు. చంద్రబాబు కేశినేని నానీకి పార్టీ విప్ గా అవకాశం ఇచ్చారు. అయితే నానీ చంద్రబాబు ఇచ్చిన పదవిని నిరాకరించారు . లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్దేవ్ను , అలాగే లోక్సభ ఫ్లోర్ లీడర్గా రామ్మోహన్నాయుడిని, పార్టీ విప్గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు.దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని.. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. మరోపక్క నానీని బుజ్జగించటానికి గల్లా జయదేవ్ ను రంగంలోకి దింపటం సైతం నానీకి రుచించలేదు. ఎవరి విషయంలో అసహనంతో ఉన్నారో ఆయననే నానీతో రాయబారానికి పంపటం సైతం నానీ అసహనానికి కారణం అని తెలుస్తుంది. అందుకే గల్లా జయదేవ్ వచ్చినా అక్కడ పని జరగలేదని టాక్. ఇదే సమయంలో చంద్రబాబు నానీకి కాల్ చేసి రావాలని పిలిచినా , ఏదైనా ఉంటె మాట్లాడదామని, పబ్లిక్ గా పోస్ట్ చెయ్యొద్దని చెప్పినా నానీ పెద్దగా స్పందించలేదని సమాచారం.
నానీ ఇలా ప్రవర్తించటం వెనుక కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు కూడా ఒక కారణం
మరోపక్క విజయవాడ లోని టీడీపీ నాయకుల తీరుపైన కూడా నానే ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది. కేశినేని నాని అలక వెనుక మాజీ మంత్రి దేవినేని ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పలువురు టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. దీంతో ఈ బాధ్యతలను టీడీపీ అధినేత కేశినేని నానికి అప్పగించారు. అయితే ఏమయిందో తెలియదు కానీ, పార్టీ కార్యాలయం ఏర్పాటు బాధ్యతలు మంత్రి దేవినేనికి ఇచ్చారు. దీంతో తనకు ఇచ్చిన బాధ్యతలను కనీసం చెప్పాపెట్టకుండా పార్టీ అధిష్టానం మరొకరికి అప్పగించడంపై నాని కలత చెందినట్లు సమాచారం. అందువల్లే లోక్ సభలో టీడీపీ విప్ పదవిని సైతం కేశినేని నాని తిరస్కరించారని తెలుస్తోంది.
నానీ పోరాటం అధినేతతోనే అని టాక్ .. చంద్రబాబుకు తలనొప్పిగా నానీ ఎపిసోడ్
మొదట నుండీ నానీ అంటే పార్టీలో ప్రాధాన్యత లేదు. జిల్లాలో నానీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. మొదట నుండీ జిల్లా నుండి దేవినేని ఉమా, బొండా ఉమాలకే ప్రాధాన్యం దక్కేది. ఇప్పుడు వారంతా ఓటమి పాలైనా కూడా జిల్లాలో పార్టీ ఓటమికి కారకులు వారే అని తెలిసినా కూడా చంద్రబాబు వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వటం కేశినేని నానీకి ఏ మాత్రం రుచించటం లేదు. అందుకే నానీ ఈ తరహా పోరాటం చేస్తున్నారు. నానీ పోరాటం మొదట నుండీ తనకు ప్రాధాన్యం ఇవ్వని అధినేత పైన, పార్టీ చావు దెబ్బ తిన్న ఈ సమయంలో కూడా ఎవరు ఏంటి అని గుర్తించని అధినేత పైన అని నానీ సన్నిహితులు భావిస్తున్నారు. చంద్రబాబు సైతం నానీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అందుకే నానీ గడ్కరీని కలిశారని పలువురు నాయకుల దగ్గర నానీ గురించి ప్రస్తావించారాణే విషయం నానీకి తెలిసింది. దీంతో నానీ ప్రస్తుతం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. నానీ పోరాటం అధినేత చంద్రబాబుతోనే అని చాలా మంది భావిస్తున్నారు. దీంతో కేశినేని ఎపిసోడ్ చంద్రబాబుకు తలనొప్పిగా మారుతుంది.