గొంతునొక్కి, అరాచక పాలన: జగన్ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని నిప్పులు
అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ పిలుపుచ్చిన నేపథ్యంలో ఎంపీ కేశినేని నానిని పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

గొంతు నొక్కుతున్నారు..
ఈ సందర్బంగా కేశినేని నాని మాట్లాడుతూ పోలీసులను వాడుకుని ప్రతిపక్షాల గొంతునొక్కోతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకే మాయని మచ్చలా మిగిలుతుందని అన్నారు. ఒక ఎంపీని గృహ నిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

పిచ్చి పిచ్చి కమిటీలతో.. సమాధానం చెప్పాలి
తాను ఏమైనా నేర చరిత్ర కలిగిన వ్యక్తినా? అని కేశినేని నాని ప్రశ్నించారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రజల రాజధాని అని.. అలాంటి రాజధానిని మార్చడం జగన్ వల్ల కాదని అన్నారు. పిచ్చి పిచ్చి కమిటీలు వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని కోరుతున్నారని తెలిపారు. అమరావతి కోసం టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించారు.

కొనసాగుతున్న రైతుల ఆందోళన.. ఉద్రిక్తత
ఇది ఇలావుండగా, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అసెంబ్లీని ముట్టడించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే, భారీగా మోహరించిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో పలువురు రైతులు, మహిళలు గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

సమర్థవంతంగా అడ్డుకున్న పోలీసులు
పలువురు రైతులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. దీంతో జై అమరావతి అంటూ మహిళలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన మహిళలను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, పలుచోట్ల రైతులు ధర్నాలకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications