దేవినేని ఉమాపై కొడాలి నాని ధ్వజం ... వైసీపీకి సంబంధం లేదు, అరాచకాలతో ప్రజలే తిరగబడ్డారన్న మంత్రి
టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అరాచక పాలన పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక దేవినేని ఉమాపై జరిగిన దాడి ఘటనపై స్పందించిన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలీసులను దేవినేని ఉమా బెదిరించారు
టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలే తిరగబడ్డారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పోలీసులను దేవినేని ఉమా బెదిరించారని, గ్రామస్తులను కావాలనే దేవినేని ఉమా రెచ్చగొట్టారని ఆరోపించారు కొడాలి నాని. పోలీసులను దేవినేని ఉమ ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని, దళితులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని కొడాలి నాని స్పష్టం చేశారు. దేవినేని ఉమాపై గ్రామస్తులు దాడి చేయడానికి కారణం అదేనని పేర్కొన్నారు.

వైఎస్ఆర్సిపి పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది
దేవినేని అనుచరులే దాడులు చేసి తమ మీద దాడి జరిగిందని చెప్తున్నారన్నారు . వైసీపీ నేత కారు అద్దాలను దేవినేని ఉమా అనుచరులు ధ్వంసం చేశారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని ఆపడం కోసం టిడిపి నేతలు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. వైఎస్ఆర్సిపి పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడిన కొడాలి నాని వైసిపి కార్యకర్తలపై దాడి చేసి వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంతో వైసీపీకి సంబంధం లేదు
అవినీతి చక్రవర్తి, వెన్నుపోటు దారుడు చంద్రబాబునే అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని. పబ్లిసిటీ కోసం ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై దేవినేని ఉమా చేసినవి నిరాధారమైన ఆరోపణలు అంటూ కొడాలి నాని మండిపడ్డారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో వైసీపీకి సంబంధం లేదన్నారు .

టీడీపీ నేతలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఫైర్
2014 నుండి 2019 వరకు అత్యధిక మైనింగ్ జరిగిన ప్రాంతం ఇదేనని గుర్తు చేసిన కొడాలి నాని టిడిపి నేతలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో పట్టింపు లేకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా తీరు వల్లే ప్రజలు తిరగబడ్డారని కొడాలి నాని ధ్వజమెత్తారు .

టిడిపిని బిజెపికి అప్పజెప్పి సింగపూర్, మలేషియా పారిపోయే ప్లాన్ లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని బిజెపికి అప్పజెప్పి సింగపూర్, మలేషియా పారిపోవడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడని, అందులో భాగంగానే బీజేపీతో చర్చలు జరుపుతున్నాడని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తిని నమ్మి టిడిపి నాయకులు అల్లర్లు చేస్తే చూస్తూ సహించేది లేదని తేల్చిచెప్పారు. చెప్పులతో ఎన్టీఆర్ ను కొట్టింది వాళ్లే, పూజించేది వాళ్లే.. ఆయన పేరు చెప్పి మళ్ళీ ఓట్లు అడుక్కునేది వాళ్లే అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకుమించిన వ్యక్తి దేవినేని ఉమా అంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అక్రమాలు దేవినేని హయాంలోనే జోరుగా సాగాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications