ఇక విజయవాడలోనే ల్యాబ్.. వేగంగా రిపోర్ట్.. ఐసోలేషన్ ఈజీ
ఒమిక్రాన్ నిర్దారణ కావడానికి రెండురోజులు పడుతుంది. ఎందుకంటే శాంపిల్ పుణెలోని జినొమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ పంపాలి.. పరీక్ష చేయాలి రిపోర్టు రావాలి. ఈ లోపు సదరు వ్యక్తి మొత్తం తిరిగేస్తున్నాడు. దీంతో విజయవాడలో సెంటర్ ఏర్పాటు చేశారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజ్లో సంపూర్ణ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతుండడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ స్థానికంగా అందుబాటులోకి రావడంతో.. వేరియంట్ను వేగంగా నిర్ధారించే అవకాశం ఉంది.
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు. ఒమిక్రాన్తో పాటు ఇతర వేరియంట్లను ఈ ల్యాబ్లో నిర్ధారించవచ్చు. మూడురోజుల్లో వేరియంట్ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటిదాకా శాంపిళ్లను హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇప్పుడిక స్థానికంగానే నిర్ధారించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోగులను త్వరగా గుర్తించి ఐసొలేట్ చేయడం, చికిత్స అందించడానికి వీలవుతుంది. వేరియంట్ వ్యాప్తి నియంత్రించవచ్చు. ల్యాబ్కు హైదరాబాద్కు చెందిన CCMB, CSIR సహకారం అందిస్తున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ఏపీపై పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి పెరిగింది.
మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ముఖ్య సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదని, ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చని హెచ్చరించారు.
ఇటు రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని.. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాలు ప్రోగ్రామ్స్ రద్దు చేసుకోవాలని డీహెచ్ విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రం ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని.. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 101 శాతం పూర్తి అయ్యిందని అంటున్నారు. సెకండ్ డోస్ 71 శాతం మాత్రమే పూర్తి అయ్యింది.