జలీల్ ఖాన్ను వెంటాడిన గతం, కూతురుకు మతపెద్దల షాక్: ఏం జరిగిందంటే?
విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత జలీల్ ఖాన్ కూతురు షబానాపై మతపెద్దలు సోమవారం నాడు ఫత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రిజ్వీ ఫత్వాను జారీ చేశారు.
జలీల్ ఖాన్ను వెంటాడుతోన్న గతం
జలీల్ ఖాన్ కూతురుకు ఇలా ఫత్వా జారీ కావడం వెనుక ఆయనను గతం వెంటాడుతోందని అంటున్నారు. గతంలో ఆయన చేసిన చర్య ఇప్పుడు ఆయనకు రివర్స్ అవుతోందని చెబుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ మేయర్ మల్లికా బేగం కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ దక్కించుకున్నారు. అదే సమయంలో ఆ టిక్కెట్ కోసం ప్రయత్నించిన జలీల్ ఖాన్ భంగపడ్డారు.
ఫత్వా కారణంగానే నేను ఓడిపోయా
దీంతో మతపెద్దలతో కలిసి ఒత్తిడి చేసి మల్లికా బేగం పైన జలీల్ ఖాన్ ఫత్వా జారీ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2009లో టిక్కెట్ దక్కించుకున్న మల్లికా బేగం ఓడిపోయారు. ఫత్వా కారణంగా తాను ఓటమి చెందినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి అంతటికి జలీల్ ఖాన్ కారణమనేది ఆమె వాదన. ఈ మేరకు మల్లికా బేగం నిరసనకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఫత్వా జారీ చేశారు.
నాకు ఫత్వా.. జలీల్ ఖాన్ కూతురు షబానాకు జారీ చేయాలని డిమాండ్
ఇప్పుడు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో షబానా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పదేళ్ల క్రితం తనకు ఫత్వా జారీ చేశారని, ఇప్పుడు షబానాకు ఎందుకు జారీ చేయలేదని మల్లికా బేగం ప్రశ్నించారు. మత పెద్దలను ఆమె నిలదీశారు. ఈ ఫత్వా కారణంగా ఆనాడు ముస్లీంలు తనకు ఓటు వేయలేదని, జలీల్ ఖాన్ మతాన్ని అడ్డుపెట్టుకొని తనను ఓడించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనను అప్పుడు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేసిన జలీల్ ఖాన్ ఇప్పుడు తన కూతురును రాజకీయాల్లోకి ఎలా తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
కూతురు రాజకీయాల్లోకి రావడంపై జలీల్ ఖాన్ వాదన ఇదీ
కాగా, ఫత్వాపై జలీల్ ఖాన్ కూడా స్పందించారు. మల్లికా బేగంపై ఫత్వా జారీ చేసిన విషయం నిజమేనని, కానీ అప్పుడు ఆమె ఆ ఫత్వాను గౌరవించలేదని ఆరోపించారు. ఫత్వాను పక్కన పెట్టి రాజకీయాలు చేసి పోటీ కూడా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తన కూతురును మల్లికా బేగం ఎలా ప్రశ్నిస్తోందని అడిగారు. ఇప్పుడు మాకు ఫత్వా ఇచ్చిన మా పని మేం చేసుకుంటామని చెప్పారు. 2009 నాటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని చెప్పారు. మా అమ్మాయి ఫత్వా జారీ చేసినా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సౌదీ లాంటి దేశాల్లోనే ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. జలీల్ ఖాన్ కూతురుకు ఫత్వా జారీ చేయడంపై మతపెద్దలు కూడా స్పందంచారు. అయితే మహిళలందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు.