విజయవాడలో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు: ముంద్రా పోర్ట్ డ్రగ్స్ వ్యవహారం
విజయవాడ: గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో కేజీల కొద్దీ లభించిన మాదక ద్రవ్యాల కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్కు దిగుమతి అయిన అంశం కావడం వల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థను రంగంలోకి దించింది. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ముంద్రా పోర్ట్లో లభించిన మాదక ద్రవ్యాలతో ఏపీకి సంబంధం లేదని, ఇదివరకే తేల్చి చెప్పినప్పటికీ- ఎన్ఐఏ అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.
దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు విజయవాడలో విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే సోదాలు చెన్నై, కోయంబత్తూరుల్లోనూ చోటుచేసుకున్నాయి. ఈ మూడు చోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలను చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బందర్ అబ్బాస్ పోర్ట్ మీదుగా 2,988.21 కేజీల మాదక ద్రవ్యాలు గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ఈ మాదక ద్రవ్యాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉన్నట్లు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. కొందరు నాయకులపైనా వారు విమర్శలను గుప్పించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రకటనలో ఈ విమర్శలకు తెర పడింది. ఏపీకి సంబంధం లేదని హోం శాఖ వివరణ ఇచ్చింది. విజయవాడ అడ్రస్ మాత్రమే ఇచ్చినట్లుగా గుర్తించామని పేర్కొంది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన డ్రగ్స్ కావడం వల్ల ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణ చేపట్టాల్సిన బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. చెన్నై, కోయంబత్తూరుల పేర్లు కూడా ముడిపడి ఉండటంతో ఎన్ఐఏ అధికారులు అక్కడా తనిఖీలను చేపట్టారు. కోయంబత్తూరు బెల్ట్లో ఇస్లామిక్ స్టేట్స్ సానుభూతిపరులు నివసించారంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా గుర్తించిన ఈ మాదక ద్రవ్యాలతో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదులకు లింక్ ఉందేమోననే కారణంతో కోయంబత్తూరుల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్ఐఏ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తనిఖీల సందర్భంగా తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు.. ఇతర లింకులపై సమగ్రంగా ఆరా తీసిన తరువాత ఓ ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, విజయవాడల్లో ఈ తనిఖీలను నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలో ఎన్ఐఏ అధికారులు జమ్మూ కాశ్మీర్లో సోదాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications