విజయవాడలో 5 స్థార్ హోటల్ : అమరావతిలో మరొకటి : ప్రారంభానికి సిద్దం..
ఏపి రాజధాని లో కొత్త హంగులు సమకూరుతున్నాయి. నూతన రాజధాని పరిధిలో నూతనంగా 5 స్టార్ హోటల్స్ ప్రారంభం అవుతున్నాయి. విజయవాడలో కొత్త అందాలను తెచ్చే విధంగా ఈ హోటల్ నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 9వ తేదీన ప్రారంభించే ఈ 5 స్టార్ హోటల్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. విజయవాడ తో పాటుగా అమరావతి పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో మరో 5 స్టార్ హోటల్ ను నిర్మించాలని నిర్ణయించారు.
విజయవాడ లో అంతర్జాతీయ సొబగులతో 5 స్టార్ హోటల్ సిద్దమైంది. అన్ని హంగులతో సిద్దమైన నోవాటెల్ హోటల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న ప్రారంభిచనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లు, అధికారుల సహకారంతో 'అతిథుల ఆనందమే' ధ్యేయంగా ఎకార్ కంపెనీ ప్రోత్సాహంతో అధునాతనంగా నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.
హోటల్ లో మొత్తం 227 గదులు, 4 రెస్టారెంట్లు, 10వేల చ.అడుగుల సమావేశ మందిరం, ఒలింపిక్స్ ప్రమాణాలతో నిర్మించిన 45 మీటర్ల ఈతకొలను, భూగర్భంలో మూడు ఫ్లోర్లలో 200 కార్ల పార్కింగ్, సౌర విద్యుత్తు, ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, 200 మీటర్ల వాకింగ్ ట్రాక్, ధ్యానం, యోగా, జిమ్, స్పా, సెలూన్, వైఫై సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్ తో పాటుగా భవిష్యత్లో సీఆర్డీఏ సహకారంతో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 5స్టార్ హోటల్, 33 ఏళ్ల లీజుతో మరో 5 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఈ నూతన హోటల్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.