ఆర్టికల్ 370 రద్దుకు పవన్ మద్దతు ... సుందర కాశ్మీర్ లో శాంతి నెలకొంటుందని నమ్ముతున్నానన్న జనసేనాని
ఆర్టికల్ 370 రద్దు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. బిజెపి సర్కార్ తీసుకున్న చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని చాలావరకు రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా సమర్థిస్తున్నాయి. మోడీ సర్కార్ కు మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో బిజెపి అంటే పరమశత్రువు గా భావించే టిడిపి అధినేత చంద్రబాబు సైతం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక వైసిపి సభాముఖంగా నే మోడీకి మద్దతు ప్రకటించింది. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం మోడీ తీసుకున్న నిర్ణయానికి తన అభినందనలు తెలియజేశారు.

జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో కేంద్రప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా భీమవరం వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో సుందరమైన కాశ్మీర్ లో శాంతి నెలకొంటుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. అఖండ భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన హింసలో రెండు ప్రాంతాల నుంచి లక్షల మంది చనిపోయారని చదివినపుడు హృదయం ఆవేదనకు గురయ్యిందని పవన్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మోడీ తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమయిన నిర్ణయమని అభినందించారు.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక తాజాగా ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications