చంద్రబాబును ఇంట్లో కూర్చోబెట్టింది అందుకే...ప్రభుత్వానికి కాస్త టైమ్ కావాలన్న మంత్రి బొత్సా
ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని, చంద్రబాబు విధానాలు నచ్చకనే ప్రజలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలే ఇసుకను దోచుకుతిన్నారని అన్న బొత్స సత్యనారాయణ టిడిపి నేతలు ఇసుక విషయంలో కూడా ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు సవాల్ చేసిన మంత్రి బొత్సా ... ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకమని చెప్పే ధైర్యం ఉందా?
ప్రభుత్వం ఒడిదుడుకుల్లో ఉందని బొత్సా వ్యాఖ్యలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతల దోపిడీ సాగడం లేదని అందుకే అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంచెం టైం కావాలని, ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పిన బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష పార్టీలు వైసిపి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి దాడికి ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి పనిలోనూ విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు మాటల దాడికి దిగుతున్నాయి అని బొత్స మండిపడ్డారు.
ఇంగ్లిష్ మీడియంపై రాద్దాంతం వద్దన్న బొత్సా
ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? అని ప్రశ్నించారు.మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? అంటూ విపక్ష నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంగ్లభాషలో విద్యాబోధన చెయ్యొద్దని ప్రధాని మోదీ ఏమీ చెప్పలేదన్నారు. ఇక రాజధాని వ్యవహారంలోనూ బొత్ససత్యనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ల్యాండ్ పూలింగ్ పేరుతో 35 వేల ఎకరాల భూమిని లాగేసుకున్నారని ఆరోపణ
రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు గతంలో ఆయన పాలించిన ఐదేళ్లలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు బొత్ససత్యనారాయణ. చంద్రబాబు హయాంలో అమరావతిలో కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మించారని బొత్స విమర్శించారు. ఇక అంతే కాదు ల్యాండ్ పూలింగ్ పేరుతో 35 వేల ఎకరాల భూమిని లాగేసుకున్నారు అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బిల్డింగ్లు 70శాతం కట్టేందుకే రూ.4,900 కోట్లు ఖర్చు అయ్యాయా? అని బొత్స సత్యనారాయణ చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబుకు నాడు ప్రజలు ఓట్లు వేసింది 5ఏళ్ళకే .. 50 ఏళ్ళకు కాదు అన్న బొత్సా
చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే 50 ఏళ్ళు పదవిలో ఉంటాను అనుకున్నారా? అని ఎద్దేవా చేసిన బొత్స సత్యనారాయణ ప్రజలు ఓటేసింది కేవలం ఐదేళ్లకే అని బాబు తెలుసుకోవాలని హితవుచెప్పారు. చంద్రబాబు విధానాలు నచ్చకనే ప్రజలు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారని చురకలు అంటించారు. లక్ష కోట్ల బడ్జెట్ వేసి, 4 వేలకోట్లు మాత్రమే రాజధానికి ఉపయోగించారని విమర్శలు చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు డెవలప్ చేసి అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. అమరావతికి వస్తానన్న చంద్రబాబు తాను చేసింది తప్పే అని ఒప్పుకోవాలని,అప్పుడే అమరావతికి రావాలని బొత్స డిమాండ్ చేశారు.