13 ముక్కలు -17 కేసులు- బెజవాడలో కొంపముంచిన పేకాట....
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం ఇప్పుడు కరోనా రాజధానిగా మారిపోతోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు సైతం అంతుబట్టడం లేదు. తాజాగా రెండు రోజుల వ్యవధిలో ఓ ఎస్సై, మరో లారీ డ్రైవర్ కారణంగా కేసులు పెరిగినట్లు భావిస్తున్నతరుణంలో వీరితో పాటు స్ధానికంగా కృష్ణలంకలో పేకాట ఆడిన కొందరు కూడా ఇందుకు కారణమని తేలింది.
విజయవాడ కృష్ణలంకలోని గుర్రాల రాఘువయ్య వీధిలో స్ధానికంగా నివాసముంటున్న కొందరు లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్నారు. ఏమీ తోచక అదే వీధిలోని వీరిలో ఒకరింటికి వెళ్లిన మిగతా వారు పేకాట ఆడారు. అందరూ స్ధానికులే కావడం, ఎవరికీ అంతకు ముందు కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. చివరికి పేకాట తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయాక ఒక్కొక్కరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం మొదలైంది. చివరికి అధికారులను ఆశ్రయించగా..వెంటనే పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా వైరస్ వ్యాపించినట్లు తేలింది.
ఇప్పటికే నగరంలో కేసులు దాదాపు 100కి చేరువ కావడం, స్ధానికంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనలు ఎక్కువ కావడంతో కృష్ణలంక ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో ఈ 17 కేసులు వెలుగు చూశాయి. ఇదంతా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జరగడంతో కృష్ణలంక ప్రాంతాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇళ్లలో నుంచి బయటికొస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.