పొలిటికల్ గాసిప్ ... వల్లభనేని జంపేనా ? జగన్ కీలక పదవి ఆఫర్ చేశారా ?
ఏపీలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఊహించని విధంగా టిడిపి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారు. ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం, టీడీపీ ఘోర ఓటమి చవి చూడటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో టిడిపి నేతల పరిస్థితి తారుమారైంది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకుల పై పలు కేసులు నమోదవుతున్నాయి. టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, నేతలను కేసులతో ఇబ్బంది పెడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు వైసిపి సర్కార్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో జంప్ జిలానీలు టీడీపీని టెన్షన్ పెడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీనీ వీడబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
వల్లభనేని వంశీ వైసీపీ లో చేరతారని జోరుగా ప్రచారం
వల్లభనేని వంశీ పార్టీ మార్పు ప్రచారానికి ఊతం ఇచ్చినట్టుగా వల్లభనేని వంశీ వ్యవహార శైలి కూడా ఉంది అని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తాజాగా నిన్న వల్లభనేని బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్తో కూడా ఆయన భేటీ అయ్యారు. సుజనా చౌదరితో సమావేశమైన సమయంలో వంశి బిజెపి బాట పడుతున్నారా అన్న అనుమానం అందరికీ కలిగింది. ఇక ఆ తర్వాత జగన్ తో భేటీ కావడం తో వైసిపి తీర్థం పుచ్చుకోబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఇక జగన్ తో భేటీకి మంత్రి కొడాలి నానీ చక్రం తిప్పారని కూడా చర్చ జరుగుతుంది.
టీడీపీలో బలమైన నేత కావటంతో జగన్ ఆఫర్
గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా గన్నవరం నియోజకవర్గంలో మాత్రం టిడిపి విజయం సాధించింది. వల్లభనేని వంశీ వ్యక్తిగత ఇమేజ్ తో ఆయన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక సీఎం జగన్ కు సైతం వల్లభనేని వంశీ పై సదభిప్రాయం ఉంది. దీంతో నిన్న వల్లభనేని వంశీ జగన్ తో జరిపిన భేటీలో వంశీ వైసీపీలో చేరేందుకు జగన్తో చర్చించారని, అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీలో చేరాలంటే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దానికి వల్లభనేని కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
పార్టీలో చేరితే కీలక పదవి ఇస్తానని చెప్పారని ప్రచారం
ఒకవేళ వంశీ జగన్ చేసిన ఆఫర్ కు ఓకే అయితే జగన్ ఆయనకు ఒక కీలక పదవి ఇవ్వడానికి స్పష్టమైన హామీ ఇచ్చారని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే వల్లభనేని రాజీనామా చేస్తే గన్నవరంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నిక సీటును వంశీకీ కాదని ఆయన చేతుల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డకు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు జగన్ వంశీని ఒప్పించారని జోరుగానే ప్రచారం అవుతుంది. ఒకవేళ అదే జరిగితే గత ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైన యార్లగడ్డ మరోమారు గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసే వీలుంటుంది.
వంశీకి రాజ్య సభ ఛాన్స్ అంటూ జోరుగా చర్చ
ఇక అందుకుగాను సీఎం జగన్ వంశీనీ రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా వల్లభనేని మాత్రం త్వరలోనే వైసీపీ పంచన చేరుబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీపావళి తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ఇంతకీ వల్లభనేని వంశీ వైసిపి తీర్థం పుచ్చుకుంటారా ?లేకా బిజెపి బాట పడతారా? అది రెండు కాకుండా టీడీపీ లోనే కొనసాగుతారా అనేది దీపావళి తర్వాత తెలియనుంది.
ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరతారా ?
మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీలో బలమైన నేతగా ఉన్న వల్లభనేని వంశీ కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారని, ఆయన తన సిద్ధాంతాలకు కట్టుబడి వల్లభనేని వంశీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసిపి తీర్థం పుచ్చుకుంటారా ..లేదా అన్నది త్వరలోనే తేలనుంది.