వైసీపీ-టీడీపీ లోపాయకారి ఒప్పందంః ఆ విషయంలో పరస్పర సహకారంః విజయవాడలో
విజయవాడః రాష్ట్రపతి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడానికి ప్రజా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు, ఏపీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆయా పార్టీల లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తలో దారి పట్టాయి. భిన్న నిర్ణయాలను తీసుకున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయనుంది. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ- ఈ విషయంలో బీజేపీ వైపు మొగ్గు చూపింది.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. కేంద్ర ప్రభుత్వంతో తన ఘర్షణ వైఖరిని మరోసారి నిరూపించుకుంది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తామని ప్రకటించింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ బాటలోనే నడిచింది. ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయనుంది. సామాజిక న్యాయం అనే పేరుతో ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే వాదన ఉంది.
ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడం వల్ల ఆమె గానీ, బీజేపీ లేదా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నాయకులు గానీ అడక్కముందే తాము మద్దతు ఇచ్చామని టీడీపీ నాయకులు బాహటంగానే సమర్థించుకుంటోన్నారు. ఈ పరిణామం రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ-టీడీపీల వైఖరి పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తోన్న బీజేపీకి బుద్ధి చెప్పకుండా.. ఈ రెండు పార్టీలు కూడా లాలూచీ పడ్డాయనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
టీడీపీ-వైసీపీ వైఖరికి నిరసనగా ఇవ్వాళ విజయవాడలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించనున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నాచౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కాపాడాలి అనే నినాదంతో ఈ ఆందోళన కొనసాగనుంది. ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయొద్దంటూ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు మెమొరాండం కూడా ఇచ్చారు.