ఆదాయ పరంగా నిలదొక్కుకున్నా..: బాబు..జగన్ హయాంలో రాష్ట్ర రెవిన్యూ ఇలా: గతం కంటే 2.10 శాతం..!
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి రెవిన్యూ రాబడుల పైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం లో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నా మని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇది సానుకూల పరిణామంగా జగన్ పేర్కొన్నారు. ఇతర శాఖల ఆదాయాల్లో పెద్దగా తేడా లేకపోయినా.. ఎక్సైజ్..రవాణా..గనుల శాఖల్లో మాత్రం రెవిన్యూ తగ్గిపోయింది. అయినా..ఎక్సైజ్ శాఖలో ఆదాయం తగ్గినా.. బార్ల విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, శాఖల వారీగా లక్ష్యాలకు కొన్ని శాఖలు చేరుకోగా..కొన్ని శాఖల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కీలకమైన ల్యాండ్ రెవిన్యూలో గత ఏడాది కంటే భారీగా తగ్గుదల నమోదైంది. ఆదాయ శాఖల పైన ముఖ్యమంత్రి నిర్వహించిన సీమీక్షలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అక్టోబర్ నెలాఖరు వరకు వచ్చిన రెవిన్యూ వసూళ్ల వివరాలను ఆ శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

రెవిన్యూ వసూళ్లల్లో ఒడిదుడికులు..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రస్తుత ఆర్దిక సంవ్సరంలో అనేక శాఖల రెవిన్యూ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల్లో 0.14శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.24,947 కోట్లు కాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.24,982 కోట్లుగా అధికారులు వివిరించారు. అదే విధంగా..ఎక్సైజ్ శాఖలో 8.91 శాతం ఆదాయం తగ్గిందని అధికారులు లెక్కలు తేల్చారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.4043.72 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ. 3683.25 కోట్లుగా నిర్ధారించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 3.26 శాతం ఆదాయం పెరుగుదల నమోదైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.2804.67 కోట్ల ఆదాయం రాగా..ఈ ఏడాది అక్టోబరు వరకు రూ. 2895.96 కోట్ల ఆదాయం సమకూరింది.

రెవిన్యూ తగ్గిన శాఖల్లో ఇలా..
రవాణా శాఖలో 6.83 శాతం ఆదాయం తగ్గుదల నమోదైంది. రవాణా శాఖలో గత ఏడాది అక్టోబరు వరకు రూ.2116.49 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1971.91 కోట్లు గా అధికారులు నిర్ధారించారు. గనులు, భూగర్భ వనరుల శాఖలో గణనీయంగా 19 శాతం మేర ఆదాయం తగ్గుదల నమోదైంది. గనులు, భూగర్భ వనరుల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.1258 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1023 కోట్లు మాత్రమే అని అధికారులు వివరించారు. ఇక, ల్యాండ్ రెవెన్యూ శాఖలోనూ ఆదాయం తగ్గినట్లుగా తేల్చారు. గత ఏడాది కంటే 23.49 శాతం తగ్గుదల నమోదైంది. ల్యాండ్ రెవెన్యూ శాఖలో గత సంవత్సరం అక్టోబరు వరకు రూ.109.66 కోట్ల ఆదాయం రాగా..ఈ ఏడాది అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.83.9 కోట్లు వచ్చింది. అటవీ శాఖలో 78.03 శాతం ఆదాయం తగ్గటం పైన ముఖ్యమంత్రి ఆరా తీసారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.131.69 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.29.94 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో.. ఎర్ర చందనం విక్రయాల మీద ఫోకస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచన చేసారు.

గతం కంటే 2.10 తగ్గిన ఆదాయం..
ఇక.. అన్ని శాఖల నుంచి గత ఏడాది అక్టోబరు వరకు మొత్తం రూ.35,411.23 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అక్టోబరు వరకు 2.10 శాతం తగ్గి వచ్చిన ఆదాయం రూ.34,669.35 కోట్లుగా తేల్చారు. రవాణా శాఖ ఆదాయంలో మొదటి.. రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు వరసగా మైనస్ 11.81 శాతం, మైనస్ 12.42 శాతం కాగా.. అక్టోబరులో వృద్ధి రేటు 15.4 శాతం నమోదైంది.
అయినప్పటికీ రవాణా శాఖలో మొత్తం మీద ఆదాయం తగ్గి మైనస్ 6.83 శాతం వృద్ధి రేటు నమోదైంది. అయితే, రెవిన్యూ పెంపు పైన ప్రజల పైన భారం పడకుండా చర్యల పైన ప్రధానంగా చర్చ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో ఖర్చులు సైతం తగ్గేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications