ఏపీ న్యాయరాజధానిలో ట్విస్ట్-హైకోర్టు జోక్యంతో మారిన సీన్- 30న మంగళగిరిలో సీజేఐతో ప్రారంభం..
ఏపీలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం హైకోర్టును న్యాయరాజధానిగా మార్చిన కర్నూలుకు ఎందుకు తరలించడం లేదనే ప్రశ్నలు గతంలోనే తలెత్తాయి. దీనికి సమాధానంగా కేంద్రం.. హైకోర్టు ఛీఫ్ జస్టిస్, ఏపీ ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికీ న్యాయరాజధానిలో భాగమైన హైకోర్టుతో పాటు న్యాయ సంబంధిత కార్యాలయాలు కూడా కర్నూలుకు తరలించలేని పరిస్దితి ఉంది. తాజాగా ఇదే అంశంలో వైసీపీ సర్కార్ చేసిన ఓ ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.

కర్నూల్లో న్యాయరాజధాని
ఏపీలో వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో భాగంగా కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు కావాల్సి ఉంది. హైకోర్టుతో పాటు జ్యుడిషియల్ అకాడమీ, లోకాయుక్త, హెచ్చార్సీ వంటి న్యాయ సంబంధిత కార్యాలయాలు కర్నూలుకు తరలిచాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే ఇప్పటికే హైకోర్టు సూచనలతో హైదరాబాద్ లో ఉండిపోయిన లోకాయుక్త, హెచ్చార్సీ కార్యాలయాలు కర్నూలుకు చేరిపోయాయి. కానీ మూడు రాజధానులు తేలితే తప్ప న్యాయరాజధానిలో కీలకమైన హైకోర్టు, జ్యుడిషియల్ అకాడమీ మాత్రం కర్నూలుకు మార్చడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా గతంలో జ్యుడిషియల్ అకాడమీని కర్నూల్లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు జోక్యంతో తిరిగి అది మంగళగిరికి మారింది.

జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు
ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఆ ప్రయత్నాలు జరగలేదు. కానీ వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా న్యాయరాజధాని ఏర్పాటవుతున్న కర్నూలులో దీన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయరాజధాని వస్తున్నందున ముందుగానే కర్నూల్లో దీన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు దీనిపై జోక్యం చేసుకుంది.

హైకోర్టు అభ్యంతరాలు
హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో కర్నూల్లో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు కాలేదు. హైకోర్టుకు అనుబంధంగా ఉండాల్సిన జ్యుడిషియల్ అకాడమీని అమరావతికి బదులు కర్నూల్లో ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. మూడు రాజధానుల వ్యవహారం తేలకుండా హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లడం సాధ్యం కాదు. హైకోర్టు వెళ్లకుండా జ్యుడిషియల్ అకాడమీ కర్నూల్లో ఏర్పాటూ సాధ్యం కాదు. దీంతో హైకోర్టు జోక్యం ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

మంగళగిరిలోనే జ్యుడిషియల్ అకాడమీ
జ్యుడిషియల్ అకాడమీని కర్నూల్లో ఏర్పాటు చేయడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర ప్రతిపాదనకు మొగ్గు చూపింది.ఇందులో భాగంగా కర్నూల్లో శాశ్వత జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు వీలుగా, అప్పటివరకూ మంగళగిరిలో తాత్కాలిక జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 30న మంగళగిరిలోని కాజా వద్ద జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళగిరికి వచ్చి ఈ జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించబోతున్నారు. భవిష్యత్తులో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయితే అప్పుడు ఈ జ్యుడిషియల్ అకాడమీ కర్నూలుకు తరలి వెళ్లనుంది.












Click it and Unblock the Notifications