Vijayawada లో షాకింగ్-చనిపోయిందని బాడీ అప్పగింత-అంత్యక్రియలు-తిరిగొచ్చిన వృద్ధురాలు
ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళ కరోనా వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. వారు దాన్ని తీసుకెళ్లి ఖననం కూడా చేసేశారు. సీన్ కట్ చేస్తే ఆమె హఠాత్తుగా ఆటోలో ఇంటికి తిరిగొచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆరా తీస్తే జరిగిన విషయం తెలిసి నివ్వెరపోయారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...
కరోనాతో ఆస్పత్రిలో చేరిన గిరిజమ్మ
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట కొలిమి బజారుకు చెందిన ముత్యాల గిరిజమ్మ అనే వృద్ధురాలికి తాజాగా మే నెలలో కరోనా సోకింది. దీంతో ఆమెను మే 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స కూడా చేశారు. మూడు రోజుల తర్వాత కరోనాతో పోరాడుతూ ఆమె చనిపోయిందని డాక్టర్లు ఆమె మృతదేహాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతదేహానికి అంత్యక్రియలు
కరోనాతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన గిరిజమ్మ చనిపోయిందని డాక్టర్లు మృతదేహం అప్పగించడంతో కుటుంబ సభ్యులు జగ్గయ్యపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. వయసు మీద పడటం, ఆరోగ్య సమస్యలతో గిరిజమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత ఆమె కుమారుడు రమేష్ బాబు కూడా మే 23న కరోనాతో చనిపోయాడు. దీంతో ఆయనకు కూడా అంత్యక్రియలు చేసేశారు. వరుసగా తల్లీ, కొడుకులు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదనలో ఉన్నారు.
ఆటోలో ఇంటికి తిరిగొచ్చిన గిరిజమ్మ
అయితే ఇవాళ హఠాత్తుగా గిరిజమ్మ ఆటోలో ఇంటికి తిరిగొచ్చింది. సడన్గా ఆమెను చూసిన కుటుంబ సభ్యులు షాకయ్యారు. భయంతో వణికిపోయారు. సినీ ఫక్కీలో ఆమె తిరిగొచ్చిందా అన్నట్లుగా అనుమానంగా చూశారు. కాసపటి వరకూ షాక్లో ఉన్న కుటుంబ సభ్యులు చివరికి ఆమె తిరిగొచ్చిందని నిర్ధారించుకున్నారు. ఏం జరిగిందో అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో గత నెల 15వ తేదీన మరణించిందని అంత్యక్రియలు పూర్తి చేసిన వారంతా దిగ్భాంతి చెందారు.
పోల్చుకోలేక డాక్టర్ల నిర్లక్ష్యం
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్స సందర్భంగా గిరిజమ్మతో పాటు ఆమె పోలికలు ఉన్న మరో మహిళకు కూడా వైద్యులు చికిత్స చేశారు. సడన్గా ఆమె చనిపోవడంతో గిరిజమ్మే చనిపోయిందని భావించారు. చివరికి కుటుంబ సభ్యులకు కూడా అదే సమాచారం ఇచ్చి పిలిపించారు. కరోనా మృతదేహం కావడం, ప్యాక్ చేసి ఉండటంతో అలాగే తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. చివరికి గిరిజమ్మ బతికే ఉందని తెలిసి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.