సోము రాకతో బీజేపీలో మారిన సీన్‌- టీడీపీకి చుక్కలు-సంచయితకు మద్దతు.. పవన్‌ గుర్రు ?

ఏపీ బీజేపీలో చాన్నాళ్ల తర్వాత ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీని మాత్రమే టార్గెట్‌ చేస్తూ టీడీపీని భుజాల మీద మోసిన బీజేపీ అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించింది. దశాబ్దాల క్రితమే ఏపీలో కార్యకలాపాలు మొదలుపెట్టినా విధాన పరమైన తప్పిదాలతో కుదేలైన రాష్ట్ర బీజేపీ కేంద్రంలో అధికారం లభించినా కుదురుకోలేకపోయింది. దీనికి కారణమైన టీడీపీ అనుకూల వైఖరిని ఆ పార్టీ క్రమంగా వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సోము వీర్రాజు ఎంట్రీతో బీజేపీ నేతలు అధికార వైసీపీతో పాటు టీడీపీపైనా విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ కంటే ఎక్కువగా బీజేపీని సోషల్‌ మీడియాలో టార్గెట్ చేసేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

సోము ఎంట్రీతో అనూహ్య మార్పు...

సోము ఎంట్రీతో అనూహ్య మార్పు...

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును అధిష్టానం ఎంపిక చేసేటప్పుడే ఆయనకు చేసిన దిశానిర్దేశం టీడీపీ అనుకూల పార్టీగా ఉన్న ముద్రను చెరిపేసుకోవడం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరన్న నానుడిని గుర్తుపెట్టుకుని అవసరమైతే ఎందాకైనా వెళ్లేందుకు అవసరమైన స్వేచ్ఛను సోము వీర్రాజుకు కట్టబెట్టింది. దీంతో ఇదే విషయాన్ని ఎంట్రీ ఇవ్వగానే ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. జనసేన మినహా అన్ని పార్టీలను టార్గెట్‌ చేయాల్సిందేనంటూ అధిష్టానం చేసిన సూచనకు అనుగుణంగా సోము ఇప్పుడు చెలరేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూనే విపక్షంలోని టీడీపీని సందు దొరికినప్పుడల్లా చీల్చి చెండాతున్నారు. సోము వైఖరి చూశాక పార్టీలోని విష్ణు వంటి నేతలు కూడా టీడీపీపై రెచ్చిపోతున్నారు.

వార్‌ సోషల్‌ కింగ్‌లపైనే సోషల్‌ వార్...

వార్‌ సోషల్‌ కింగ్‌లపైనే సోషల్‌ వార్...

కేంద్రంలోని బీజేపీ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీకి ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఏకంగా ఫేస్‌ బుక్‌ వంటి సోషల్‌ దిగ్గజాన్ని సైతం తమవైపు తిప్పుకుని తాము చేసే విద్వేష పోస్టులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్న చరిత్ర బీజేపీది. అలాంటి కాషాయ పార్టీపైనే టీడీపీ ఏపీలో సోషల్‌ వార్‌ ప్రకటించింది. ఆ పార్టీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్‌ నరసింహారావుపై గతంలో ఎన్నడూ లేని విధంగా కుల ముద్ర వేస్తూ టీడీపీ సాగిస్తున్న వార్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటివరకూ వైసీపీ పై రెడ్డి ముద్ర వేసి సాగిస్తున్న వార్‌ను బీజేపీ నేతలపైకీ మళ్లించడంతో వారు పోలీసు ఫిర్యాదుల వరకూ వెళ్లారు.

సంచయితకూ మద్దతు...

సంచయితకూ మద్దతు...

గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఛీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ యువ మోర్చా నేతగా ఉన్న సంచయితను అర్ధరాత్రి జీవోలతో తమవైపుకు తిప్పుకున్న వైసీపీ నేతలకు సోము వీర్రాజు వచ్చీ రాగానే షాకిచ్చారు. కన్నా హయాంలో బీజేపీలో అభద్రతా భావంతో ఉంటూ ఓ దశలో వైసీపీలో చేరిపోతుందని భావించిన సంచయిత.. సోము వీర్రాజు రాకతో ఊపిరి పీల్చుకుంది. గతంలో ఆమెపై యుద్ధం ప్రకటించిన విశాఖ బీజేపీ నేతలు విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ కూడా సోము రాక తర్వాత సంచయితపై సైలెంట్‌ అయ్యారు. ఇదే అదనుగా సంచయిత చెలరేగిపోతోంది. బీజేపీలో సీనియర్‌ నేతలను మించి టీడీపీపై పోరు సాగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీకి ఇప్పుడామె భవిష్యత్‌ ఆశాకిరణంగా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. సంచయిత దూకుడును వాడుకుంటూ భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందంటే ఆశ్చర్యం కలుగక మానదు.

Recommended Video

    Floods: ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు,కోనా రెడ్డి చెరువు కు గండి ! పోటెత్తుతున్న వరద నీరు...!!
    పవన్‌ కళ్యాణ్‌ గుర్రు...

    పవన్‌ కళ్యాణ్‌ గుర్రు...


    ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు సారధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్‌ కూడా ఆ పార్టీ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీతో సమానంగా టీడీపీని కూడా టార్గెట్‌ చేయడంపై పవన్‌ గుర్రుగా కనిపిస్తున్నారు. బయటికి ఏమీ మాట్లాడకపోయినా బీజేపీతో ఈ పోరులో కలిసి వచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. వాస్తవానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటికి రాగానే తాను కూడా బీజేపీపై యుద్ధం ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌.. తిరిగి అనూహ్య పరిస్ధితుల్లో ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. కానీ మనస్ఫూర్తిగా కాలేదన్నట్లుగానే ఆయన వ్యవహారశైలి కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి దగ్గరై నెలలు గడుస్తున్నా ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన ఉమ్మడిగా పాల్గొన్న కార్యక్రమం ఒక్కటీ కనిపించదు. అలాగే టీడీపీకి రహస్య మిత్రుడిగా పేరుతెచ్చుకున్న ఆయన.. గతంలో విపక్షంలో ఉండగా వైసీపీని విమర్శించేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా విమర్శలు చేస్తున్నారు. ఈ రెండిటికీ పెద్దగా తేడా లేదనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. అలాగని బీజేపీ నేతలతో కలిసి వైసీపీ, టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారా అంటే అదీ లేదు. కానీ ప్రస్తుతం వైసీపీతో సమానంగా టీడీపీని సైతం టార్గెట్ చేస్తున్న బీజేపీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగని ఇప్పట్లో ఆయన మిత్రపక్షం బీజేపీతో కలిసి వైసీపీపై యుద్దం చేసే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+