ప్రధాని మోదీ ప్రశ్నతో అవాక్కైన సోము వీర్రాజు - పార్టీ నేతల సమక్షంలో..!!
ప్రధాని మోదీ పర్యటన వేళ సోము వీర్రాజుకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బీజేపీ ఏపీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా తమ గురించి పరిచయం చేసుకోవాలని సూచించారు.ఆ సమయంలో సోము వీర్రాజును చూసిన ప్రధాని 'ఆప్కా నామ్ క్యాహై' అని ప్రశ్నించారు. మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలని సోముకు సూచన చేసారు. దీంతో, ఒక్క సారిగా పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ప్రధాని గుర్తించకపోవటం తో వారంతా అవాక్కయ్యారు.
దీంతో, సోము వీర్రాజు తన గురించి తానే వివరించారు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాలతో పాటుగా ఇంకా ఏమీ చేస్తారని ప్రధాని ఆరా తీసారు. దీంతో, ఒక దశలో సోము తడబడినా తనకు ఏమీ లేదు సార్ అంటూ సమాధానమిచ్చారు. వ్యవసాయాం.. వ్యాపారం వంటివి లేవా అని ప్రధాని ప్రశ్నించారు. తనకు ఏమీ లేవని సోము వీర్రాజు బదులిచ్చారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ తండ్రి చలపతిరావు ఆరోగ్యం గురించి ప్రధాని వాకబు చేసారు. ఇదే సమావేశాలో ఏపీలో వైసీపీ నిర్ణయాలు, సమస్యల గురించి బీజేపీ నేతలు ప్రధానికి వివరించారు.
ఆ సమయంలో ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటూ ప్రధాని ప్రశ్నించగా, సోము వీర్రాజు 21 జిల్లాల ని సమాధానం ఇచ్చారు. పక్కనే ఉన్న నేతలు 26 అంటూ సరి చేసారు. గుజరాత్లో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేశామో వివరించిన మోదీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బలపడటం లేదని ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తనవిగా సీఎం జగన్ ప్రచారం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు ప్రధాని వద్ద ప్రస్తావించారు. కేంద్ర అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రధాని నిర్దేశించారు.
అదే సమయంలో మహిళలు..యువతకు దగ్గరయ్యేలా వారితో మమేకం అయ్యే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని పార్టీ నేతలకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి సంపూర్ణ పోషణ అదుతుందో లేదో చూడాలని, గ్రామాల్లో ఎక్కడికక్కడ స్థానిక క్రీడలు యువతతో కలిసి ఆడాలని పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లడానికి ఇదొక మంచి అవకాశమని ప్రధాని సూచించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్ల నిర్మాణం ఏపీలో సరిగా జరగడం లేదని నిధులిస్తున్నా నిర్మించి ఇచ్చేందుకు వాళ్లకు ఇబ్బందేంటని.. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని ప్రధాని పార్టీ నేతలను ఆదేశించారు.