చంద్రబాబుతో గొడవల గురించి కూడా రాశా...‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తక ఆవిష్కరణలో వెల్లడించిన ఐవైఆర్
విజయవాడ:ఎపి మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన రచించిన 'నవ్యాంధ్రతో నా నడక' అనే పుస్తకం ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగింది.
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిధిగా హాజరై 'నవ్యాంధ్రతో నా నడక' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర వేరు పడినప్పటి పరిస్థితులతో పాటు హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండగానే హడావుడిగా వదిలి ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాల గురించి కూడా ఈ పుస్తకంలో తాను రాసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రచించిన 'నవ్యాంధ్రతో నా నడక' పుస్తకం ఆవిష్కరణ ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిధిగా హాజరుకాగా...మాజీ సీఎస్లు గోపాలకృష్ణ, అజయ్ కల్లాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తదితరులు హాజరయ్యారు.
అనంతరం పుస్తక రచయిత ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి లోపభూయిష్టమైన విభజన చట్టం, అందులోని సమస్యలు ఎలా పరిష్కరించాలి తదిదర విషయాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించానని వివరించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, తనకు మధ్య తలెత్తిన బేధాభిప్రాయాల గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు.
తనకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య తలెత్తిన ఈ విభేదాల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లిందో కూడా సవివరంగా పేర్కొన్నట్లు ఐవైఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో తాను పుట్టుకతోనే గొప్పవాడిని అనే భావన ఉందని ఐవైఆర్ విమర్శించారు. ఈ అంవాలతో పాటు రాష్ట్ర పరిపాలనా సంబంధమైన అనేక అంశాల గురించి కూడా ఈ పుస్తకంలో వివరించినట్లు ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.