జగన్ కు క్లీన్ చిట్ ఇస్తారా: రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: చంద్రబాబు ఫైర్..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బట్టారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష నిర్ణయం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. సివిల్ సర్వీసు అధికారులు సీఎం ఒత్తిడి చేసినా..నిజాలు మాత్రమే చెప్పాలని..అందుకు భిన్నంగా పని చేస్తే గతంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందని గుర్తు చేసారు. పీపీఏల పైన ముఖ్యమంత్రి జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని బాబు మండిపడ్డారు. తప్పులను సరిదిద్దుకోవటానికి గతంలో తన కారణంగా కేసులు ఎదుర్కొన్న అధికారులనే ఇప్పుడు తిరిగి ఏపీకి తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. దీని పైన తాము త్వరలోనే వాస్తవాలు బయట పెడతామని స్పష్టం చేసారు.

అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా..
ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లో ప్రజలకు నరకం చూపించారాని ఫైర్ అయ్యారు. పీపీఏల విషయంలో ఎంత మంది చెప్పినా జగన్ కు అర్దం కాదా అని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికల్లో ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ ఇస్తూ..గత ప్రభుత్వం పైన బుదర చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారులు ఇదే రకంగా సహకరిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసని..ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం చేసినా..తరువాత నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని మాజీ సీెం హెచ్చరించారు. తాము భవిష్యత్ ను అంచనా వేసి ఒప్పందాలు చేసుకున్నామని..కానీ ఇప్పుడు దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్ ఇవ్వాలని ముందుకెళ్లామని చంద్రబాబు వివరించారు.

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోంది..
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయంలో జెన్కో, ట్రాన్స్కోను దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్ కోతలను అధిగమించామన్నారు. డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు. సోలార్, విండ్ ఎనర్జీ ధరలు తగ్గిపోయాయని, సోలార్, విండ్ ఎనర్జీని ఎంత ఎక్కువ వాడుకుంటే అంత లాభమని చంద్రబాబు అన్నారు. తమ చర్యల వల్ల విద్యుత్ ధర తగ్గిందని, కేంద్రం ఇన్సెంటీవ్ ఇచ్చిందన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని బాబు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి వాలంటీర్ జాబ్ అని అంటున్నారని ఎద్దేవా చేసారు.

మేఘా తెలంగాణలో ఎంతకు చేసింది...
పోలవరంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం వందల కోట్లు ఆదా చేసిందని చెబుతున్న అంశం పైన చంద్రబాబు స్పందించారు. ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి పంపిచేసారని..కేవలం ఒక్క సంస్థకే పోలవరం పనులు అప్పగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సంస్థ ఇదే గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత కోట్ చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు తక్కువ ధరకు కోట్ చేయటం ద్వారా నాసిరకంగా నిర్మాణం చేస్తారని..దొడ్డి దారిన వారికి దోచి పెడతారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నాసిరకంగా రావటంతో పాటుగా ఆలస్యం అవుతుందని జోస్యం చెప్పారు. ప్రాజెక్టు పేరున ఈ సంస్థకు ఏ స్థాయిలో నిధులు ఇస్తారో చూడాలన్నారు. అదే విధంగా గతంలో జగన్ కేసుల్లో ఉన్న వారికి ఇక్కడ పోస్టింగ్ లు ఇస్తున్నారని..వారిని పక్కన పెట్టుకొని కేసుల్లో సాక్ష్యాలను మాఫీ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దీని పైన త్వరలోనే స్పందిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications