ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:బురద జల్లితే పోటీగా చేస్తాం:చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
టీడీపీ అధినేత చంద్రబాబు తొలి సారి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే జగన్ ఏపీలో పరిస్థితుల పైన అన్ని విభాగాల్లో శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఆర్దిక పరిస్థితి పైన తొలి శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. గతంలో తామూ ఇలాగే విడుదల చేసామని గుర్తు చేసారు. ఉన్న పరిస్థితి వివరిస్తే అభ్యంతరం లేదని.. తమ పైన బుదర జల్లితే మాత్రం ప్రతిఘటిస్తామని..పోటీగా తాము విడుదల చేస్తామని హెచ్చరించారు..
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలి సారి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా అన్ని రంగాల్లోనూ శ్వేత పత్రాలను విడుదల చేయాలని కొద్ది రోజుల క్రితమే జగన్ నిర్ణయించారు. అందులో బాగంగా తొలి శ్వేత పత్రం ఆర్దిక రంగం పైన ఈ రోజు విడుదల చేస్తున్నారు. దీని మీద చంద్రబాబు స్పందించారు. శ్వేతపత్రాల్లో ఏం చెబుతారో వేచి చూస్తామన్నారు. గతంలో టీడీపీ కూడా వైట్ పేపర్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. అప్పుడూ.. ఇప్పుడూ సమాచారం ఇచ్చింది ఒకే అధికారులని పేర్కొన్నారు. అయితే..వాటర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వ తీరును చంద్రబాబు విమర్శించారు. గోదావరికి వరద ఉధృతి ఉన్నప్పటికీ పట్టిసీమ నీళ్లు ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. అధికారులతో పాలకులు సమన్వయం లేకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని విమర్శించారు. హంద్రీనీవా జలాల లబ్ధి ఆ ప్రాంత ప్రజల కళ్లల్లో కనిపిస్తుందని చంద్రబాబు వివరించారు.

బురద జల్లితే పోటీగా విడుదల చేస్తాం..
శాసనసభలో పార్టీ ఉపనేత అచ్చెన్నాయుడు సైతం ఇదే విషయం పైన స్పందించారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం మంచిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాల్లో వాస్తవాలుంటే స్వాగతిస్తామ ని పేర్కొన్నారు. అలా కాకుండా టీడీపీపై బురద జల్లేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తే మాత్రం పోటీగా మేం కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. శాసనసభలో ప్రభుత్వం అనేక అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకుందన్నారు. దానికి ఎక్కడా అడ్డురాకుండా ఉంటామని తెలిపారు. కరవుపై కూడా చర్చించాలని కోరామన్నారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో పొలిటికల్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్చ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications