ఎంక్వైరీ చేయించే దమ్ముందా? జగన్ సర్కారుకు బోండా ఉమ సవాల్
ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎంతసేపూ టీడీపీ నేతల భూములపైనే ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నేతల భూములు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవట్లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాజధాని ప్రకటన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఐదెకరాలు, నంబూరి శంకర్ ఐదుకరాలు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త రెండెకరాలు కొనుక్కున్నారని, గుంటూరు 2 నుంచి పోటీచేసిన ఏసురత్నంకు, బ్రహ్మనాయుడుకు 34 ఎకరాల భూమి ఉందని వాటికి సంబంధించిన పక్కా డాక్యూమెంట్లు తమ దగ్గరున్నాయని ఉమ చెప్పారు.
'ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్
అమరావతిలో తిరగలేరు..
గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో పుట్టిపెరిన వ్యక్తులుగా ఇక్కడ భూములు కొనే హక్కు మాకు లేదా? అని ఉమ ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతోన్న అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు.. పెయిడ్ ఆర్టిస్టుల్లా, సత్యహరిశ్రద్రుల్లా కలరింగ్ ఇస్తున్నారన్నారు. రాజధానిని మార్చడం పార్టీ బ్రాంచ్ ఆఫీలుల్ని మార్చినట్లు కాదని, దురద్రుష్టవశాత్తూ అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిని చంపేస్తోందని మండిపడ్డారు. అంబటి లాంటి నేతలు ముసుగేసుకుని తిరుగుతున్నారని, వైసీపీ నేతలెవరికీ అమరావతి ప్రజల ముందుకొచ్చే దమ్మూధైర్యం లేదన్నారు.
అదీ.. చంద్రబాబు దమ్ము..
చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో రైతులు 34 వేల ఎకరాల భూములిచ్చారని, రాజధానిని చంపేస్తోంటే ఇప్పుడు అదే రైతులతో కూర్చొని ఆయన దీక్ష చేస్తున్నారని, అదీ చంద్రబాబు దమ్మని బోండా ఉమ చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టారీతిగా రైతుల త్యాగాలను అవమానిస్తూ, వారికి మద్దతుపలికినవాళ్లను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భార్యతో కలిసి రైతుల దగ్గరికెళితే.. జగన్ మాత్రం రాజధాని వదిలి పారిపోయారని, నల్ల అద్దాలున్న కారులో, సెక్యూరిటీతో తిరుగుతున్నారని గుర్తుచేశారు. వైసీపీ రాజధాని ప్రాంతంలో తిరిగితే రైతులెవరో, పెయిడ్ ఆర్టిస్టులెవరో తెలుస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఉద్యమానికి భయపడింది..
13 జిల్లాల్లో రైతులు చేస్తోన్న ఉద్యమానికి భయపడబట్టే వైసీపీ నేతలు మళ్లీ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్'వీడియోల్ని ప్రదర్శిస్తున్నారని ఉమ ఎద్దేవా చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైసీపీ చెబుతున్నదానిపై వెంటనే జ్యూడీషియల్ ఎంక్వైరీ వెయ్యాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ, రిటైర్డ్ జడ్జితోకానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయవిచారణలోనే నిజాలు నిగ్గుతేలుతాయన్నారు. టీడీపీ నేతల భూములతోపాటు వైసీపీ నేతలు కొన్న భూములపైనా విచారణ జరగాల్సిఉందని ఉమ అన్నారు.