బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2: వైసీపీ-టీడీపీ క్రెడిట్ వార్: ఆ ఇద్దరికీ కేశినేని నాని థ్యాంక్స్
విజయవాడ: విజయవాడవాసుల మరో కల త్వరలో నెరవేరబోతోంది. ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నిత్యం వాహన రద్దీతో కిటకిటలాడే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్ 2 ఇక అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తుది మెరుగులను దిద్దుకుంటోంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే- వాహనాల రాకపోకలు మరింత మెరుగుపడతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయినట్టవుతుంది.

గద్దె రామ్మోహన్తో కలిసి..
తుది దశకు చేరుకున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఈ ఉదయం సందర్శించారు. టీడీపీకే చెందిన విజయవాడ తూర్పు శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా రోడ్డు-రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపుగా నిర్మాణ పూర్తయిందని, కొద్దిపాటి ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు వివరించారు.

జనవరి నాటికి ఛాన్స్..
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి నాటికి ఈ రెండో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెన్నై-కోల్కత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. నిర్మల కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. ఫలితంగా- బెంజ్ సర్కిల్ వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాత్రివేళల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంటుంది.

భారత్మాల ప్రాజెక్ట్..
ఈ ట్రాఫిక్ గండాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం- జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఈ ఫ్లైఓవర్లలను నిర్మించింది. భారత్మాల ప్రాజెక్ట్లో ఈ రెండు ఫ్లైఓవర్లు భాగం. 2017లో ఈ రెండింటి నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ఈ రెండింట్లో ఓ ఫ్లైఓవర్ ఇదివరకే వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ ఫ్లైఓవర్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి.

తుదిదశకు నిర్మాణ పనులు..
ఇదే బెంజ్ సర్కిల్ మీదుగా రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. దీని పొడవు.. 2.7 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం 90 కోట్ల రూపాయలు. వచ్చే సంవత్సరం మే నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అధికారులు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటంతో అనుకున్న సమయానికి ముందే ఇది అందుబాటులోకి రానుంది. జనవరిలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తోన్నాయి.

చంద్రబాబు వల్లే..
ఈ నిర్మాణ పనులను కేశినేని నాని సందర్శించారు. కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడి దూరదృష్టి వల్లే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు కార్యరూపం దాల్చాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అనుమతులను మంజూరు చేసిందని వ్యాఖ్యానించారు.

ప్రచార యుద్దం..
ఇది కాస్తా- అధికార వైఎస్సార్సీపీ, టీడపీ మధ్య మరోసారి క్రెడిట్ వార్కు దారి తీసేలా కనిపిస్తోంది. ఇదివరకు తొలి ఫ్లైఓవర్ విషయంలోనూ కేశినేనాని ఈ ప్రచార యుద్ధానికి తెర తీసిన విషయం తెలిసిందే. తొలి ఫ్లైఓవర్ నిర్మాణ ఘనత తమదేనంటూ కేశినేని చెప్పుకోగా.. అధికార పార్టీ నాయకులు దాన్ని తోసిపుచ్చారు. కేంద్రానికి చెందిన ప్రాజెక్ట్ను టీడీపీ తన ఖాతాలో ఎలా వేసుకుందని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications