బీజేపీతో చేతులు కలిపిని కేశినేని : రూటు - సీటు ఖాయమంటూ..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారం.. కీలక మలుపు తిరగబోతోన్నట్టే కనిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్నారంటూ వార్తలు వెలువడుతున్న పరిస్థితుల్లో ఆయన సంచలన నిర్ణయం తీసుకోనే అవకాశాలు లేకపోలేదు. టీడీపీకి గుడ్బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి, అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

సునీల్ ఇంటికి..
భారతీయ జనత పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ నివాసానికి వెళ్లారు కేశినేని నాని. ఢిల్లీలోని ఆయన నివాసంలో వినాయక చవితి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మరోసారి బీజేపీతో పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తోన్న ప్రయత్నాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

బోకేతో
కేశినేని నాని- కొంతకాలంగా చంద్రబాబుపై తీవ్ర అసహనంతో ఉంటోన్న విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును అక్కడి విమానాశ్రయంలో స్వాగతం పలికే సమయంలో కేశినేని అనుసరించిన వైఖరి అప్పట్లో కలకలం రేపింది. చంద్రబాబుకు బొకే ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన తోటి ఎంపీ గల్లా జయదేవ్ ఆహ్వానించినప్పటికీ- ముఖం మీదే తిరస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఎట్ హోమ్లో..
దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గవర్న్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో ఇచ్చిన ఎట్ హోమ్కు చంద్రబాబు పార్టీ ఎంపీలు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడితో కలిసి హాజరయ్యారు. తనతో కేశినేని నానికి ఎలాంటి విభేదాలు లేవనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమం తరువాత నాని మళ్లీ తెర వెనక్కి వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వంతో గానీ, కార్యక్రమాల్లో గానీ పెద్దగా పాల్గొనట్లేదు.

చిన్ని రాకతో..
తనకు బదులుగా సోదరుడు చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం నానిలో నాటుకుపోయిందని, అందుకే ఆయన టీడీపీకి దూరంగా ఉంటోన్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది. విజయవాడకే చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు గుప్పించినప్పటికీ- చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ పట్టించుకోలేదని పైగా ఆయనను ఇంకా ఎంకరేజ్ చేశారనే అసహనం నానిలో ఉన్నట్లు చెబుతున్నారు.

నాని-సునీల్..
ఈ పరిస్థితుల మధ్య- కేశినేని నాని టీడీపీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపించాయి. ప్రత్యామ్నయంగా బీజేపీలో చేరొచ్చనే ప్రచారం సాగింది. అదే సమయంలో- నాని బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ దియోధర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబించాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications