మద్యం అమ్మకాలపై టీడీపీ ఫైర్: గద్దె అనురాధ, కేశినేని శ్వేత నిరసర దీక్ష: ఎన్నికల స్టంట్గా వైసీపీ
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ముప్పేటదాడికి దిగింది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోన్న టీడీపీ.. దాని తీవ్రత తగ్గకముందే.. మరో సామాజిక అంశాన్ని అందిపుచ్చుకొంది. కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. జగన్ సర్కార్ మద్యం షాపులను తెరవడంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. కరోనా కంటే ప్రమాదకరంగా మద్యం అమ్మకాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపిస్తోంది.
విశాఖలో భారీగా స్టెరిన్ గ్యాస్ నిల్వలు: ఎల్జీ పాలిమర్స్లో 13 వేల టన్నులు: షిప్పుల ద్వారా తరలింపు
రాష్ట్రంలో మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, విజయవాడ మున్సిపల్ కార్పరేషన్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ సోమవారం ఉదయం తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని కుమార్తె, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అభ్యర్థి కేశినేని శ్వేత మద్దతు ఇచ్చారు. టీడీపీ మహిళా నేతలు 12 గంటల పాటు నిరాహార దీక్ష ఆరంభించారు. ఈ ఉదయం 9 గంటలకు ఆరంభమైన ఈ దీక్ష రాత్రి 9 గంటలకు ముగియబోతోంది.
జె టాక్స్ కోసం ప్రభుత్వం మద్యం షాపులను తెరిచిందని కేశినేని శ్వేత ఆరోపించారు. అధికారంలోకి రావడానికి ముందు మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. దానికి భిన్నంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అధికారాన్ని అందుకున్న తరువాత మద్యం విక్రయాకు గేట్లు ఎత్తేశారని విమర్శించారు. మహిళలను, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం వద్దని అన్నారు. వెంటనే మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న సమయంలో పోలీసులు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, హెల్త వర్కర్లు, పారిశుద్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు చేస్తున్నారని, వారి సంక్షేమాన్ని ప్రభు్తవం పట్టించుకోవట్లేదని శ్వేత ఆరోపించారు. లాక్డౌన్ వల్ల పూట గడవని పరిస్థితుల్లో పేదల ప్రజలు ఉన్నారని, వారంతా ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు.
అలాంటి వారిని మరింత ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. మద్యం షాపులను తెరవడం వల్ల ఇంట్లోని విలువైన వస్తువులను తీసుకెళ్లి అమ్మేసి మరీ మద్యం కొంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే తన హామీని నెరవేర్చకపోతే లాక్డౌన్ తరువాత మద్యం షాపులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని అన్నారు. గద్దె అనురాధ, కేశినేని శ్వేత చేపట్టిన దీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార స్టంట్గా అభివర్ణిస్తోంది.