జగన్ తెలంగాణ సీఎం కావాలని జనం అనుకుంటున్నారు.. కేటీఆర్ కామెంట్స్పై పేర్ని నాని
ఏపీలో వసతుల గురించి మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. వైసీపీ మంత్రులు, నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజా.. ఏపీకి రావాలని మంత్రి కేటీఆర్ను కోరిన సంగతి తెలిసిందే. నాలుగు కాదు 4 వందల బస్సుల్లో ఏపీకి వచ్చి చూడాలని మరో మంత్రి సవాల్ విసిరారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిదని సజెస్ట్ చేశారు.
కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ కేవలం మాటలే అని విమర్శించారు. జగన్ ఏదైనా చెప్పారంటే, అది చేసి తీరుతారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. జగన్ మా సీఎం అయితే బాగుండు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ విమర్శలు చేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు సరిగా లేదు. ఏపీలో కరెంట్ సరిగా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు తనతో స్వయంగా చెప్పారని అన్నారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు.
బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై దుమారం రేగింది. మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. తమ రాష్ట్రం అభివృద్దిలో మిన్న అని చెబుతున్నారు. విపక్ష నేతలు అయితే సమయం దొరికింది కదా అని సెటైర్లు వేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని ఎంత పనిచేశావ్.. జగన్ అంటూ నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి చెందిన నేతలు ఇలా కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు.