రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత.:.రోడ్డుకు అడ్డంగా రైతులు: పోలీసులు వర్సెస్ గ్రామస్థులు..!
రాజధాని తరలింపు ప్రతిపాదనల పై అమరావతి పరిధిలోని గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో రైతులు రోడ్ల మీదకు వచ్చారు. అటు విజయవాడలో రాజధాని పరిరక్షణ సమితి నేతలు ధర్నా కు దిగారు. అందులో మొత్తం 22 సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక, మందడం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉంది. ఉదయం అక్కడ టెంట్ వేసుకొనేందుకు పోలీసులు నిరాకరించారు.
రాజధాని రైతుల ఆందోళనలు ఉధృతం ... నేడు జలదీక్షలు, గవర్నర్ తో భేటీ , వామపక్ష నేతల పర్యటన
సిచివాలయ ఉద్యోగులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని..వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయవద్దని పోలీసులు సూచించారు. మందడం గ్రామానికి వామపక్ష నేతలు చేరుకున్నారు. స్థానికులకు మద్దతుగా ధర్నాలో కూర్చొని రాజధాని మార్పు ప్రతిపాదనకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. పోలీసుల సూచనలను గ్రామస్థులు ఖాతరు చేయటం లేదు. రోడ్డు పైనే పెద్ద ఎత్తున గ్రామస్థులు..రైతులు బైఠాయించారు. దీంతో.. మరో మార్గం ద్వారా సచివాలయానికి రాక పోకలు సాగించేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయవాడ ధర్నాచౌక్ లో రాజధాని పరిరక్షణ సమితిగా ఏర్పడిన అఖిల పక్షం..మద్దతు సంఘాల నేతలు ధర్నాకు నిర్ణయించారు. దీంతో..ముందుగానే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీని పైన ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసారంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనతో పాటుగా టీడీపీ నేతలు బోండా ఉమా.. బుద్దా వెంకన్నను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
ఇదే సమయంలో శుక్రవారం కేబినెట్ సమావేశం ఉండటంతో పోలీసులు మందడం..తుళ్లూరు..వెలగపూడి గ్రామాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. గ్రామాల్లోకి కొత్త వారు ఎవరైనా వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఇక, వైసీపీ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు..నేతలు మధ్నాహ్నం సమావేశం అవుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదన మీద వారి అభిప్రాయం స్పష్టం చేయనున్నారు. మధ్నాహ్నం సమావేశం తరువాత తమ అభిప్రాయం స్పష్టం చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేసారు.
మందడం గ్రామంలో రోడ్డు పైనే స్థానికులు కుటుంబాలతో కలిసి..రైతులు బైఠాయించారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేసారు. 144 సెక్షన్ అమల్లో ఉందని చెబుతూ..పోలీసులు వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పైన స్థానిక మహిళలు మండిపడుతున్నారు. తాము రాజధాని కోసం పోరాటం చేస్తుంటే..పోలీసులు తమతో దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
వైసీపీ అమరావతి ప్రాంత నేతలు స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని..లేకుంటే వారి రాజకీయ భవిష్యత్ కు నష్టం తప్పదని కార్యాచరణ సమితి నేతలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు హైకోర్టు వద్ద న్యాయ వాదులు విధులు బహిష్కరించారు. అమరావతిలోనే రాజధాని..హైకోర్టు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడి..క్రిష్టాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి.