కృష్ణా జిల్లాలో విషాద ఘటన .. తప్పిపోయిన చిన్నారులు విగతజీవులుగా
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని సగర్ల పేటకు చెందిన ముగ్గురు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన ఘటన కలకలం రేపగా, తాజాగా ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారిన విషాదం గ్రామంలో స్థానికులను ఆవేదనకు గురి చేసింది.
కృష్ణాజిల్లా ఈదర గ్రామం లోని సగర్ల పేట కు చెందిన ముగ్గురు చిన్నారులు ఖగ్గ శశాంక్ 11 సంవత్సరాలు, చంద్రిక తొమ్మిది సంవత్సరాలు, కోట్ల జగదీష్ ఎనిమిది సంవత్సరాలు ఇంటిముందు ఆడుకుంటుండగా కనిపించకుండా పోయారు. తమ పిల్లలు కనిపించడం లేదని ఖగ్గా దుర్గ జ్యోతి అనే మహిళ ఫిర్యాదు ఇచ్చింది. శశాంక్, చంద్రిక తో పాటుగా పక్కింటబ్బాయి జగదీష్ కూడా వారితో ఉన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు పిల్లలను వెతకడం కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
నూజివీడు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ముగ్గురు చిన్నారుల మృతి దేహాలను ఈదర గ్రామ సమీపంలోని చెరువులో కనుగొన్నారు. అయితే ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులు వారంతగా వారు చెరువు దగ్గరికి ఈతకు వెళ్లారా? లేదా ఎవరైనా వారిని చెరువులో పడేసి హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కంటికి కడివెడు శోకిస్తున్నారు.