విజయవాడలో అర్ధరాత్రి కలకలం: పార్క్ చేసిన వాహనాలకు నిప్పు: రియల్ ఎస్టేట్ తగాదేనా?
విజయవాడ: విజయవాడలోొ బుధవారం అర్ధరాత్రి కలకలం చెలరేగింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఇంటి బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలపై పెట్రోలు పోసి, నిప్పంటించేశారు. ఈ ఘటనలో ఆయా వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. రియల్ ఎస్టేట్ తగాదేలే ఈ ఘాతుకానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులో కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 12:19 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. దీనిపై బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెట్రోలును దొంగతనం చేసే వారు ఈ ఘాతుకానికి తెగబడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపులో తొలి వికెట్: చీఫ్ మార్షల్ పై బదిలీ వేటు: నెక్స్ట్ ఎవరో?
సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగ్ నగర్ శివాలయం వీధి, శ్రీనగర్ కాలనీలో ఈ రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. శివశంకర్ అనే బిల్డర్ ఒకరు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రోజూలాగే ఆయన రాత్రి ఆయన తన ఇంటి వద్ద కారును పార్క్ చేసి ఉంచారు. అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై శ్రీనగర్ కాలనీలో తిరుగాడారు. అనంతరం- శివశంకర్ ఇంటి వద్ద పార్క్ చేసి ఉంచిన ఆయన కారుపై పెట్రోలు పోసి, నిప్పంటించారు. ఈ ఘటనలో కారు మొత్తం కాలిపోయింది. అనంతరం సింగ్ నగర్ శివాలయం వీధిలో కూడా మూడు బైక్ లకు నిప్పంటించి, పారిపోయారు. కాలిపోయిన తమ వాహనాలను చూసి నిర్ఘాంతపోయారు బాధితులు. వెంటనే సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనలు చోటు చేసుకున్న ప్రదేశాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు అందించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారించినట్లు తెలుస్తోంది. అలాగే- కొందరు పాత నేరస్తులను కూడా సత్యనారాయణ పురం పోలీసులు స్టేషన్ కు పిలిపించి.. ఈ ఘటన గురించి ఆరా తీసినట్లు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో ఉండటం వల్ల త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సత్యనారాయణ పురం ఎస్ఐ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన అన్నారు.