వకీల్సాబ్ టికెట్ల రేట్లపై పట్టువీడని థియేటర్లు- ఏపీ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏపీలో రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనుక్కున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుకు సిద్దమయ్యాయి. వకీల్ సాబ్ టికెట్ల రేట్లను కేవలం రెండు రోజుల పాటు మాత్రమే పెంచుకునేందుకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు వారు సిద్దమయ్యారు.
Recommended Video
గత నెలలో వకీల్సాబ్ టికెట్ల రేట్లను పెంచుకునేందుకు హైకోర్టు ఏపీలో థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం నిరాకరించడంతో సమస్య మొదలైంది. ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయించిన ఎగ్జిబిటర్లకు అక్కడ చుక్కెదురైంది. మూడు రోజులకు బదులుగా కేవలం రెండు రోజులు మాత్రమే రేట్లు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తాము నష్టపోతున్నామని చెప్తున్న ధియేటర్ల యాజమాన్యాలు మరోసారి దీనిపై హైకోర్టులో పోరాటానికి సిద్దమయ్యాయి.
ఏపీలో కొత్త సినిమాలకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం కొత్త జీవో తీసుకొస్తామని హైకోర్టుకు చెప్పింది. దీంతో ఆ కొత్త జీవో వచ్చే వరకూ పాత జీవో ప్రకారం రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిటర్లు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కొత్త జీవో రాకముందే రేట్ల పెంపును అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న థియేటర్లు... గతంలో ఉన్న ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతున్నాయి. అలా చేస్తే కనీసం మరికొన్ని రోజుల పాటు ధరలు పెంచి టికెట్లు అమ్మేందుకు సిద్దమవుతున్నాయి. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.