విజయవాడ ఎయిర్పోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం - ఎయిర్పోర్ట్ డైరెక్టర్ క్లారిటీ
విజయవాడ ఎయిర్పోర్టులో ఉద్యోగాల పేరుతో ఈ మధ్య కొన్ని ఆన్లైన్ నోటిఫికేషన్లు దర్శనమివ్వడంతో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఎయిర్పోర్టులో ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్ధలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు ఆన్లైన్లో ప్రకటనలు ఉంచారు. వీటిని నిజమని నమ్మిన నిరుద్యోగులు అందిన కాడికి దోచుకుని అన్లైన్లోనే అపాయింట్మెంట్ లెటర్లు పంపిస్తున్నారు. తీరా వాటిని పట్టుకుని ఎయిర్పోర్టుకు వెళ్లిన వారు మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో విజయవాడ పోలీసుల సాయంతో ఎయిర్పోర్టు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజాగా ఇలా పలువురు ఆన్లైన్ జాబ్ లెటర్స్ పేరుతో మోసపోయిన ఘటనపై ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ మధుసూధన్రావు స్పందించారు. ఉద్యోగాల పేరుతో మోస పోయిన కొందరు తమకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగం కావాలనుకునే వాళ్లు ఎయిర్లైన్స్ వెబ్సైట్స్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఇతరత్రా వెబ్సైట్లలో నోటిఫికేషన్లు చూసి మోసపోవద్దని ఆయన నిరుద్యోగులకు సూచించారు. ఎయిర్లైన్స్లో ఎలాంటి ఇంటర్వ్యూ, రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు.
ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్మెంట్ లెటర్ ఆన్లైన్లో పంపిస్తే అది ఫేక్గా గుర్తించాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ముందుగా ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలన్నారు.
ఇకపై ఉద్యోగాల పేరుతో మోసాలు జరగకుండా ఓ ప్రత్యేక టెలిఫోన్ నంబరును కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ మధుసూధన్ రావు వెల్లడించారు. ఇప్పటికే ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారి విషయంలో విజయవాడ పోలీసులతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు.