తెలంగాణ మద్యం అక్రమ రవాణా- దుర్గగుడి పాలమండలి సభ్యురాలి రాజీనామా
ఏపీలో మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే స్వయానా వైసీపీ నేత ఒకరు అక్రమ మద్యాన్ని సొంత కారులో తరలిస్తూ పట్టుబడటం కలకలం రేపింది. విజయవాడ కనకదుర్గ గుడి పాలమండలి సభ్యురాలిగా ఉన్న నాగ వరలక్ష్మి కారులో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడటం వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
నిన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఎక్సైజ్ పోలీసులు ఓ కారును పట్టుకున్నారు. ఇందులో తనిఖీలు నిర్వహించగా విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగ వరలక్ష్మికి చెందినదిగా గుర్తించారు. ఇందులో భారీగా అక్రమ బాటిళ్లు రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కారును, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. దీనిపై బోర్డు సభ్యురాలు వరలక్ష్మిని ప్రశ్నించగా.. తనకు సంబంధం లేదని డ్రైవర్ కారు తీసుకెళ్లాడని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై కేసులు నమోదు చేశారు.

తన కారులో అక్రమ మద్యం పట్టుబడిన నేపథ్యంలో కనకదుర్గ గుడి పాలనమండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. బోర్డు పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడికి తన రాజీనామా పత్రాన్ని పంపించారు. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఆమె రాజీనామాను ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు తమ పరపతిని అడ్డుపెట్టుకుని తెలంగాణ నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడటం వైసీపీకి తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications