జగన్ దగ్గరో, కేసీఆర్ దగ్గరో ఇలా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?
నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగుదేశం పార్టీలోని నేతలకు స్వేచ్ఛ ఎక్కువవుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్టీ రామారావు ఉన్నంతకాలం నోరు తెరిచి మాట్లాడటానికే జంకేవారు. పార్టీమీద, ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవాన్ని చాటుకునేవారు. అసందర్భమైన వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, అధినేతనే ధిక్కరిస్తూ నిర్ణయాలు తీసుకోవడంలాంటివేవీ లేవు. ఎవరికి అప్పగించిన పనులు వారు నిబద్దతతో చేసుకుపోయేవారు.

పార్టీలో హద్దులు మీరుతున్న స్వేచ్ఛ?
కాలక్రమంలో చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత బాబు బలహీనతలను ఆసరా చేసుకొని మాట్లాడటం, బ్లాక్ మెయిల్ కు దిగడంలాంటివి ఎక్కువయ్యాయి. అనంతర పరిణామాల్లో ఉమ్మడి రాష్ట్రం విభజనకు గురైంది. ఏపీపై ఎక్కువగా దృష్టిసారిస్తున్న టీడీపీలో ప్రస్తుతం ఈ తరహా నేతలు ఎక్కువవుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అభిప్రాయం కలుగుతోంది. పార్టీలో స్వేచ్ఛ హద్దులు మీరుతోందని, ఇంకా.. ఇంకా ఉపేక్షించుకుంటూ వెళితే చంద్రబాబుకే నష్టమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

పార్టీ పరువును బజారున పడేస్తున్న నేతలు!
ఒకటి లేదంటే రెండుసార్లు నేతలు రచ్చచేశారంటే అక్కడి పరిస్థితులు అలా ఉన్నాయిలే అనుకొని సర్దుకుపోవచ్చు. కానీ పదే పదే పార్టీ పరువును బజారున పడేసే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్లు తెలుగు తమ్ముళ్ల నుంచే వస్తున్నాయి. ఒకరకంగా చంద్రబాబు సహనాన్ని కూడా ఈ తరహా నేతలు పరీక్షిస్తున్నారనుకోవచ్చు. పార్టీలో సీనియర్ నేతగా ముందుండి నడవాల్సిన కేశినేని నాని వ్యవహారం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థం కాకుండా ఉంది.

పార్టీ అధినేతపైనే సెటైర్లు!
స్థానికంగా ఉండే నేతలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అంతేకాకుండా మీడియా ఎదుట టీడీపీపై, చంద్రబాబుపై సెటైర్లు వేయడం, పార్టీ ప్రత్యర్థులతో స్నేహం చేస్తానని హెచ్చరిస్తున్నారు. పార్టీని ఇరకాటంలోకి నెట్టే పనులు చేయడంతోపాటు ఇటీవలే ఢిల్లీ విమానాశ్రయంలో బాబుకు ఆహ్వానం పలికేందుకు వెళ్లగా బొకేను విసిరికొట్టినంత పనిచేశారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తేనే మంచి భవిష్యత్తు అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నానిలాంటివారు ఇలా చేయడంపై సొంత పార్టీ నేతలనుంచే విమర్శలు వ్యక్తమవుతున్నా ఆయన పట్టించుకోవడంలేదు.

అంతర్మథనం చేసుకోవాలి?
మూడు సంవత్సరాలుగా కేశినేని ఇదే పద్ధతిలో నడుస్తున్నారని పార్టీలో కీలకమైన నేతలను అభాసుపాలుచేయడంలాంటివి చేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? ఉంటే రుజువులు, ఆధారాలతో కొన్నింటిని పంపిస్తానని, చర్యలు తీసుకోండంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాకుండా కేసీఆర్, జగన్ లాంటివారి దగ్గరైతే ఈ విధంగా మాట్లాడేవారా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తనకు తాను అంతర్మథనం చేసుకోవాల్సిన బాధ్యత కూడా కేశినేనిపై ఉంది.












Click it and Unblock the Notifications