వంగవీటి రాధాపై రెక్కీ- అతడే అంటూ ప్రచారం : సంబంధం లేదంటున్న కుమారుడు..!!
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బెజవాడ రాజకీయం ఇప్పుడు రాధా వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలు రాధా వ్యాఖ్యల పైన ఫోకస్ పెట్టాయి. ఇదే సమయంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి కొడాలి నాని నేరుగా సీఎంకు ఈ విషయం పైన నివేదించారు. వంగవీటి రాధా తనను పొట్టన పెట్టుకొనేందుకు రెక్కీ జరిగిందని చెప్పటంతో వెంటనే సీఎం జగన్ టు ప్లస్ టు గన్ మెన్లను కేటాయించాలని పోలీసు శాఖను ఆదేశించారు.

గన్ మెన్లను తిరస్కరించిన రాధా
అదే విధంగా పోలీసు అధికారులు గన్ మెన్లను కేటాయించగా... రాధా వారిని తిరస్కరించారు. గన్మెన్లు అవసరం లేదని పంపించివేశారు రాధా. ప్రజలతో ఉండే మనిషిని కాబట్టి సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాధాపై రెక్కీ చేసింది వైసీపీ కార్పొరేటర్ ఆరవ సత్యనారాయణ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో.. రాధాపై రెక్కీ నిర్వహించారన్న అనుమానంతో ఆరవ సత్యం, దేవినేని అవినాష్ వంగవీటి అనుచరులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

దేవినేని కుటుంబంతో సత్సంబంధాలు
అరవ సత్యం తొలి నుంచి దేవినేని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. దీంతో..ఇప్పుడు ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో అరవ సత్యం కుమారుడు చరణ్ మీడియా ముందుకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి తన తండ్రి హాజరయ్యారని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గమనించి నిన్న సరాసరి ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. బ్లడ్ ప్రజర్ ఎక్కువ కావడంతో వచ్చి ఆసుపత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నారని చెప్పారు. దేవినేని నెహ్రూ స్పూర్తితో తన తండ్రి పైకి వచ్చారని వెల్లడించారు. తాను బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ హడావుడిగా వచ్చానన్నారు. అరవ సత్యం రెక్కీ చేసారు అని చెపుతున్నది అబద్ధమని చెప్పారు.

ఖండించిన సత్యం కుమారుడు
ఆయనను కష్టడీ కి తీసుకున్నది అబద్ధమన్నారు. ఎవరితో తమకు ఎటువంటి గొడవలూ లేవన్నారు. తాము కష్టంలో ఉండగా ఇలా మా మీద నెగెటివ్ గా రాయద్దని కోరారు. తమ పనేదో తాము చూసుకుంటున్నామని చెప్పారు. ఆయన ఇంకా 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పారని వివరించారు. అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. కొంతమంది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తన తండ్రి కోలుకుని బయటకు వచ్చాక మాట్లాడతారని చరణ్ వెల్లడించారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు సైతం రాధాకు ఫోన్ చేసారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీజీపీకి లేఖ రాసారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications