వైసీపీ నేత పీవీపీకి హైకోర్టు డెడ్ లైన్ - పోలీసులకు లొంగిపోవాలని ఆదేశం - కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్
ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్, టాలీవుడ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కీలక నేత పోట్లూరి వర ప్రసాద్(పీవీపీ)కు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఆఫీసులో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని పీవీపీ, ఆయన అనుచరులే కిడ్నాప్ చేసి, మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టారంటూ నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video

అసలేం జరిగిందంటే..
గతేడాది సెప్టెంబర్ లో తన భర్తను పీవీపీ బౌన్సర్లు కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లారని ఆరోపిస్తూ తిమ్మారెడ్డి భార్య సుధారాణి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పీవీపీతో పాటు మరికొందరు తనను కిడ్నాప్ చేసి, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారంటూ పోలీసులకు తిమ్మారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి పీవీపీతోపాటు ఆయన భార్య, అనుచరులపై జూబ్లీ హిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఇప్పుడీ వ్యవహారంపైనే హైకోర్టు విచారించింది.

నాలుగు వారాల గడువు..
తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో పీవీపీ, అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, నాలుగు వారాల్లోగా పీవీపీ సహా నిందితులు అందరూ సంబంధిత పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కాగా, తిమ్మారెడ్డి కిడ్నాప్ వ్యవహారంతో తనకుగానీ, తన అనుచరులకుగానీ ఎలాంటి ప్రమేయం లేదని, ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు విచారణ చేపట్టింది.

ఆధారాలు లేవు.. అందుకే..
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సినీ, రాజకీయ రంగంలో కలకలం రేపింది. తిమ్మారెడ్డి కిడ్నాపైన కొద్ది సేపటికే ఆయన భార్యతో పీవీపీ సంభాషించినట్లుగా ఉన్న ఓ ఆడియో సంచలనం రేపింది. కిడ్నాప్ గురించి తనకు తెలీదని పీవీపీ చెప్పడం ఆడియోలో స్పష్టంగా వినిపించింది. ఆయన తరఫు లాయర్ కూడా ఇదే వాదనను కోర్టులో వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తిమ్మారెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో పీవీపీ, ఆయన అనుచరులకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే, నాలుగు వారాల్లోగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని మాత్రం మెలికపెట్టింది.

దాడి, కుక్కల కేసుల్లోనూ..
ఓ విల్లా వివాదానికి సంబంధించి కైలాష్ అనే వ్యక్తిపై దాడికి తెగబడి, బెదిరించారని, నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కల్ని ఉసిగొల్పారనే ఆరోపణలపై పీవీపీ, ఆయన అనుచరులపై బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ పీవీపీ పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ కేసులోనూ హైకోర్టు పీవీపీకి అనుకూలంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే..

దాన్ని చెత్తబుట్టలో పారేసి..
రాజకీయాలు, సినిమా నిర్మాణంతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే పీవీపీ.. సందర్భానుసారంగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నేపథ్యంలో టీపీసీసీ నిర్వహించిన కార్యక్రమానికి సోనియా, రాహుల్ గాంధీలు సందేశం ఇవ్వడంపై పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పీవీ మన ఠీవి అని, మన దేశ దిశ మార్చిన మహానాయకుడు అని ఆఖరికి ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు ఒప్పుకున్నారు. మన ఆంధ్రా నుంచి పార్లమెంట్ కి వెళ్లి, 29 సంవత్సరాల క్రితం, లైసెన్స్ రాజ్ ను చెత్త బుట్టలో పడేసి, నవ భారత్ ని సృష్టించిన పీవీ''అని దివంగత నేతను కీర్తించారు. చిన్న వ్యాపారాలు మొదలుకొని, పెద్ద పరిశ్రమల స్థాపనకు పెద్ద అడ్డంకిగా ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థను నిర్మూలించడం పీవీ ఆర్థిక సంస్కరణల్లో ప్రధానమైనదిగా చెబుతారు.












Click it and Unblock the Notifications