జగన్ ఫోన్కాల్: ఫలించిన పరిమళ్ నత్వానీ లాబీయింగ్: స్పందించిన గుజరాత్ సీఎం: కెమికల్స్ ఎయిర్ లిఫ్ట్
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంది. రసాయనిక పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గుజరాత్ నుంచి.. విష వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన కెమికల్స్ను తెప్పించబోతోంది. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో ఫోన్లో మాట్లాడారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, అపర కుబేరుడు అనిల్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీతోనూ సంప్రదింపులు జరిపారు.
పారా-టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ఛాల్ రసాయనాల ఎయిర్లిఫ్ట్..
విష వాయువుల ప్రభావాన్ని అప్పటికప్పుడు తగ్గించడంలో గణనీయంగా ప్రభావాన్ని చూపే రసాయనాల గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు. విష వాయువుల తీవ్రతను తగ్గించడంలో పారా-టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ఛాల్ (పీటీబీసీ) కెమికల్స్.. గుజరాత్లోని వాపి నగరంలో గల పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ వెంటనే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీకి ఫోన్ చేశారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి హఠాత్తుగా విష వాయువులు వెలువడ్డాయని వివరించారు. దీని తీవ్రతను తగ్గించడానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేయాలని విజ్ఙప్తి చేశారు.

పరిమళ్ నత్వానీకి ఫోన్..
అదే సమయంలో వైఎస్ జగన్.. పరిమళ్ నథ్వానీతోనూ మాట్లాడారని తెలుస్తోంది. పరిమళ్ నత్వానీ.. గుజరాతీయుడే. ఆయనకు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మంచి పట్టు ఉంది. లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఉంది. దీనితో ఆయన పలుకుబడిని కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా వినియోగించుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రితో తాను ఫోనులో మాట్లాడానని, పారా-టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ఛాల్ కెమికల్స్ను విశాఖపట్నానికి చేర్చాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. దీనితో ఆయన హుటాహుటిన విజయ్ రుపాణీ కార్యదర్శి అశ్వని కుమార్కు ఫోన్ చేశారు.
వాపి నుంచి రోడ్డు మార్గంలో దమన్కు.. అక్కడి నుంచి వాయుమార్గంలో..
వాపి పారిశ్రామికవాడలో గల రసాయన పరిశ్రమల నుంచి 500 కేజీల పారా-టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ఛాల్ (పీటీబీసీ) కెమికల్స్ను రోడ్డు మార్గంలో దమన్కు తరలిస్తోంది గుజరాత్ ప్రభుత్వం. దమన్ నుంచి వాయుమార్గంలో ఈ రసాయనాన్ని విశాఖపట్నానికి తరలిస్తారు. విష వాయువుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వాటిని వెదజల్లుతారు. ఎలాంటి విష వాయువుల తీవ్రతనైనా చెప్పుకోదగ్గ స్థాయిలో నియంత్రించగల సామర్థ్యం ఈ పీటీబీసీ కెమికల్స్కు ఉందని తెలుస్తోంది. అందువల్లే గుజరాత్ నుంచి వాటిని 500 కేజీల మేర తెప్పించుకుంటోంది జగన్ సర్కార్.
Recommended Video

విష వాయువుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో..
ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం సహా టైలర్స్ కాలనీ, ఇందిరానగర్, నాయుడుతోట, వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు, సింహాచలానికి వెళ్లే మార్గాలు, కొత్తపాలెం, భగత్సింగ్ నగర్, మాధవాపురం, సింహపురి కాలనీ, కృష్ణరాయపురం, పొర్లుపాలెం, సంతోష్ నగర్, కాకాని నగర్, సింహపురి కాలనీ.. వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా సముద్రపు నీటిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో చల్లుతారు. మరి కొన్ని గంటల్లో ఆ కెమికల్స్ విశాఖపట్నానికి చేరకుంటాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. జగన్ విజ్ఙప్తి మేరకు తాము వాటిని పంపిస్తున్నట్లు విజయ్ రుపాణీ కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications