విశాఖ మన్యంలో మరోమారు.. 1000 కేజీల గంజాయి పట్టివేత
విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతుంది. ఇటీవల రెండు రోజుల క్రితం పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్న ఘటన మరువక ముందే మరోమారు విశాఖ మన్నెంలో భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు .
ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రెండు రోజుల్లో 670 కేజీలు సీజ్
తాజాగా విశాఖ ఏజెన్సీ లో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.మన్యంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు గంజాయి విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందన్నారు. ముంచంగిపట్టు మండలం కిలగాడ వద్ద బోలెరో పిక్ అప్ వ్యానులో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు . పాడేరు ప్రొహిబిషన్, అనకాపల్లి టాస్క్ ఫోర్స్, ఎక్సయిజ్ పోలీసులు దాడులు చేసి ఈ సరకును పట్టుకున్నారు. గంజాయిని పాడేరు ఎక్సయిజ్ స్టేషన్కు తరలించారు.
ఇటీవల విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపట్టు మండలం మారుమూల బిర్రిగుడ ఇళ్లల్లో భారీ మొత్తంలో గంజాయి నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందటంతో అప్పుడు సైతం పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. ముంచంగిపుట్టు పోలీసుల సహాయంతో బిర్రిగుడ ఇళ్లలో తనిఖీలు నిర్వహింఛి ఆ గ్రామంలోని మూడిళ్లలో బ్యాగులలో ప్యాక్ చేసి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 6 టన్నుల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. గంజాయి బ్యాగులను పాడేరు ఎక్సైజ్ స్టేషన్ కి తరలించి, గంజాయి నిల్వ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
ఇక మొన్నటికి మొన్న పర్యాటకుల ముసుగులో విశాఖ మన్యం నుంచి విజయనగరం జిల్లా కొత్తవలసకు భారీ స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న బస్సును విశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పాడేరు మండలంలోని కరకపుట్టు కూడలిలో రూ.35 లక్షల విలువైన గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మన్యంలోని చిత్రకొండ నుంచి టెంపో ట్రావెల్ టూరిస్టు బస్సులో గంజాయి ప్యాకెట్లను విజయనగరం జిల్లా కొత్తవలసకు తరలిచేందుకు ప్రయత్నించగా సమాచారం అందడంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాడేరు మండలం కరకపుట్టు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టూరిస్టు బస్సులో వెయ్యి కిలోల గంజాయి పట్టుబడింది .