విశాఖపట్నానికి కొత్త హంగులు - ఇతర రాజధానులతో అనుసంధానం ..!!
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నానికి కొత్త హంగులు వచ్చేశాయి. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ఆవిర్భవించడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి ప్రయాణ వసతులు మరింత మెరుగు పడుతున్నాయి. ఇతర నగరాలతో అనుసంధానం పెరుగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలతో రోడ్-రైల్-విమాన కనెక్టివిటీని కలిగివున్న ఈ స్టీల్ సిటీపై ప్రైవేట్ పౌర విమానయాన సంస్థలు దృష్టి సారించాయి.
ఇప్పటికే విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం వందేమాతరం ఎక్స్ప్రెస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విజయవాడ-విశాఖపట్నం, సికింద్రాబాద్-విజయవాడ-తిరుపతి మార్గాల్లో రెండు వందేమాతరం ఎక్స్ప్రెస్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రావడానికి సన్నహాలు చేస్తోంది.
జీ20 సన్నాహాక సదస్సు కూడా విశాఖలోనే ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిక తాజాగా విమాన సర్వీసుల సంఖ్య కూడా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరుతో విశాఖపట్నం అనుసంధానం మరింత పెరిగింది.
కొత్తగా విశాఖపట్నంలో ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రతిరోజూ తన విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చిందీ సంస్థ. ఆకాశ ఎయిర్ విమానాలు విశాఖపట్నం-బెంగళూరు మధ్య రోజూ రెండుసార్లు రాకపోకలు సాగిస్తాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది నగరాలను అనుసంధానిస్తూ విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. 10వ నగరంగా విశాఖపట్నాన్ని ఎంచుకుంది.
ఈ విమాన సర్వీసులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం వంటి నగరానికి గల వసతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో ఇతర ప్రధాన నగరాలు, రాజధానులతో విశాఖను అనుసంధానించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని అన్నారు. అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలు విశాఖలో ఏర్పాటు కానున్నాయని, దీనికి అవసరమైన అన్ని వసతులను తమ ప్రభుత్వం సమకూర్చుతోందని వివరించారు.