ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి జగనే కారకుడు: తండ్రి దోపిడీకి వారసుడు: అచ్చెన్న, నారాయణ
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువ చేసే స్టీల్ ప్లాంట్ భూముల కోసమే ఆయన ఆ కుట్ర పన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి మరీ.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారని, మండిపడ్డారు. ఈ కుట్రను తాము సాగనివ్వబోమని, అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. అందుకోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు.
పంచాయతీ ఎఫెక్ట్: మంగళగిరిలో నారా లోకేష్: జగన్ రెడ్డి ఒత్తిడి వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న పార్టీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాస్ను ఆయన పరామర్శించారు. దీక్షా శిబిరానికి వచ్చి, తన సంఘీభావాన్ని తెలిపారు. తన పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా విశాఖపట్నానికి చెందిన పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన తరువాత ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్నవి వెళ్లిపోతోన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే.. దానికి జగన్దే బాధ్యత అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన దోపిడీని ఆయన వారసుడిగా జగన్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఓబుళాపురం గనుల వ్యవహారం ఏమైందని ప్రశ్నించారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరించడానికి చేసిన ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకున్నారని అన్నారు.
సీపీఐ సీనియర్ నేత నారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలనుకోవడం, పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనుకోవడం మోడీ ప్రభుత్వం దివాళాకోరు విధానాలకు నిదర్శనమని అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వమే ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సి ఉందని చెప్పారు. అత్యధిక ఎంపీలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం సరికాదని, ముఖ్యమంత్రి వైఖరిపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయని నారాయణ చెప్పారు.