విశాఖ భూములు ఫర్ సేల్- బీచ్ రోడ్డుతో పాటు 18 చోట్ల-వేల కోట్ల టార్గెట్
ఏపీలో నిధుల వేటలో ఉన్న వైసీపీ సర్కార్ ప్రభుత్వ భూముల అమ్మకం కోసం ప్రారంభించిన మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. పాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపట్నంలో విలువైన 18 భూములను కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్బీసీసీ సాయంతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయల్ని ఆర్జించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భూముల వేలం ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎన్బీసీసీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ భూముల్ని అభివృద్ధి చేసి అమ్మిపెట్టడం ఎన్బీసీసీ బాధ్యత.
Recommended Video


విశాఖలో అమ్మకానికి ప్రభుత్వ భూములు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్ధ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్బీసీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విలువైన ప్రభుత్వ స్ధలాలను అమ్మడం ద్వారా భారీ ఎత్తున నిధులు సేకరించాలనేది సర్కార్ లక్ష్యం. ఇందుకోసం ఎన్బీసీసీ సహకారం తీసుకుంటోంది. విశాఖ, విజయవాడ, గుంటూరుతో పాటు పలు చోట్ల ఇప్పటికే భారీ ఎత్తున స్ధలాల విక్రయానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో బాగంగా విశాఖలోని ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెడుతున్నారు.

18 స్ధలాల వేలానికి ఎన్బీసీసీ నోటిఫికేషన్
ఏపీలో గుర్తించిన విలువైన ప్రభుత్వ భూముల్ని అభివృద్ధి చేసి అమ్మి పెట్టడం ఎన్బీసీసీ బాధ్యత. తొలి విడతలో విశాఖలోని 18 ఎంపిక చేసిన స్ధలాలను అమ్మిపెట్టేందుకు ఎన్బీసీసీ సిద్ధమైంది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ స్ధలాల వేలానికి ఎన్బీసీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకూ నమూనా ఈ-వేలాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్బీసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 22వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రీబిడ్ ఈఎండీ సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

విశాఖలో వేలం వేసే స్ధలాలివే
విశాఖలో వేలానికి నిర్ణయించిన స్ధలాల్లో బీచ్ రోడ్డులో గతంలో లూలూ సంస్ధకు కేటాయించి వెనక్కి తీసుకున్న 18 ఎకరాల స్ధలంతో పాటు అగనంపూడి, ఫకిర్ టకియాలో పలు సర్వే నంబర్లలో స్ధలాలు ఉన్నాయి. మొత్తం 18 స్ధలాలను వేలానికి ఎన్బీసీసీ ప్రకటన విడుదల చేసింది. వీటిలో లులూ సంస్ధ నుంచి తీసుకున్న 18 ఎకరాల్లో 13.59 ఎకరాలను వేలం వేయబోతున్నారు. మిగిలిన స్ధలాలన్నీ ఎకరం కంటే తక్కువే ఉన్నాయి. ఫకిర్ టకియాలో వేలానికి గుర్తించిన స్ధలాల్లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ.43 లక్షలుగా నిర్ణయించారు.

వేల కోట్ల టార్గెట్
విశాఖలో ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించిన స్ధలాలన్నీ భారీగా విలువ చేసేవే. త్వరలో పాలనా రాజధాని కూడా రానున్న నేపథ్యంలో వేలంలో ఈ స్ధలాలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో బీచ్రోడ్డులో గతంలో లూలూ సంస్ధకు ఇవ్వజూపిన స్ధలంతో పాటు మరో 17 స్ధలాలు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఒక్క బీచ్ రోడ్డులో 18 ఎకరాల స్ధలం విలువే దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఎన్బీసీసీ రూ.1452 కోట్ల రిజర్వు ధర నిర్ణయించింది. దీంతో ఈ వేలం ద్వారా భారీ మొత్తం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications