విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్? ఆ రెండు భవనాల్లో సెక్రటేరియట్,క్యాంప్ ఆఫీస్ల ఏర్పాటు?
రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలన్నీ దాదాపుగా అభివృద్ది వికేంద్రీకరణనే సూచించడంతో విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం
తాత్కాలిక సీఎం క్యాంప్ ఆఫీస్,సెక్రటేరియట్ల కోసం ఇప్పటికే భవనాలను పరిశీలించింది.
విశాఖపట్నం-భీమునిపట్నం మార్గంలోని రిషికొండ బీచ్ సమీపంలో ఉన్న ఇన్నోవేషన్ వ్యాలీ,మిలీనియం టవర్స్లో క్యాంప్ ఆఫీస్,సెక్రటేరియట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇన్నోవేషన్ వ్యాలీ 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కోడిగుడ్డు ఆకారంలో మూడు అంతస్తుల్లో ఏర్పాటైంది. 50వేల చదరపు అడుగుల పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి క్యాంప్ ఆఫీస్కు ఇది అనువైన భవనం అని ప్రభుత్వం భావిస్తోంది.
ఇన్నోవేషన్ వ్యాలీ పక్కనే ఉన్న మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాదాపు 2లక్షల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ భవనంలో మొత్తం నాలుగు అంతస్తులు ఉన్నాయి. అందులో
మూడంతస్తుల్లో ప్రస్తుతం ఓ ఐటీ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. మరో అంతస్తు ఖాళీగానే ఉంది. ఈ భవనంలో దాదాపు 500 కార్లను పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉంది.

కాబట్టి సెక్రటేరియట్ ఏర్పాటుకు ఇది అనువైన భవనం అని ప్రభుత్వం భావిస్తోంది. రెండు భవనాలు పక్క పక్కనే ఉండటంతో ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని ఆలోచిస్తోంది. రెడీ టు ఆక్యుపై భవనాలు కావడంతో ప్రజాధనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ప్రజా రవాణాకు సంబంధించి ట్రాక్ లెస్ ట్రామ్ రైలును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. విశాఖ ప్రస్తుత జనాభా దాదాపు 20లక్షల పైనే. ఇక్కడ రాజధాని ఏర్పాటైతే జనాభా మరింత పెరగనుంది.
కాబట్టి భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రామ్ రైలును తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన డీపీఆర్ను రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించేందుకు ఆదేశాలు కూడా జారీ చేశారు.ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు ఈ రైలును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో ప్రభుత్వం దీనివైపు మొగ్గుచూపుతోంది.












Click it and Unblock the Notifications