ప్రధాని మోదీ సభ తరువాత విశాఖపై కేంద్రం కీలక నిర్ణయం..!!
విశాఖపట్నం: మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వాటి విలువ 10,500 కోట్ల రూపాయలు. కొన్నింటిని ఆయన ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.
సభ గ్రాండ్ సక్సెస్తో..
ఈ సభ అనుకున్నదాని కంటే గ్రాండ్ సక్సెస్ కావడం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ విషయంలో వారు వైఎస్ జగన్ను అభినందనలతో ముంచెత్తారు. మోదీ సభను విజయవంతం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి చాలా ఉందంటూ విశాఖపట్నానికే చెందిన మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు అభినందించారు. మంత్రులు, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు కష్టపడ్డారని కితాబిచ్చారు.
కేంద్రం కీలక నిర్ణయం..
దీని తరువాత కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టే కనిపిస్తోంది. దక్షిణాది నగరాల్లో విశాఖపట్నానికీ గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. కొత్తగా ఓ జాతీయ స్థాయి సదస్సును విశాఖలో ఏర్పాటు చేయనుంది. దీనికి తేదీని కూడా ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని తరువాత ఒక దాని వెంట ఒకటిగా జాతీయ స్థాయి సెమినార్లు, వర్క్షాప్లు, కాన్ఫరెన్సులను విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. కన్వెన్షనల్ హబ్గా మార్చవచ్చని తెలుస్తోంది.
బీఈఈ జాతీయ సదస్సు..
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ విశాఖపట్నంలో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ను నిర్వహించబోతోంది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే కీలక విభాగం ఇది. దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల సరఫరా, విద్యుత్ పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షించడం ఈ విభాగం విధి.
ఏపీ సహకారంతో..
ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సహకారంతో ఈ జాతీయ సదస్సును విశాఖలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇన్వెస్ట్మెంట్ బజార్ ఫర్ ఎనర్జీ ఎఫీషియన్సీ పేరుతో ఇది ఏర్పాటు కానుంది. రోజంతా కొనసాగుతుందీ ఇన్వెస్ట్మెంట్ బజార్. ఇంధన రంగంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న భారీ పరిశ్రమల యజమానులు, ఈ సెగ్మెంట్కు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించనున్నారు.
సన్నాహాలు షురూ..
ఈ సదస్సు ఏర్పాటు కోసం ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ - ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్తంగా సన్నాహకాలు చేపట్టాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కే విజయానంద్తో బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రే వెబినార్ నిర్వహించారు. ఏర్పాట్ల గురించి మాట్లాడారు. దేశంలో ఎనర్జీ ఎఫీషియన్సీలో సుమారు 13.20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. 2031 నాటికి దాదాపు రూ.10.72 లక్షల కోట్లను పరిశ్రమలు, వాణిజ్య, రవాణా సెగ్మెంట్ల ద్వారానే పెట్టుబడులు వస్తాయని అన్నారు.