విశాఖలో దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది..పరిస్థితి విషమం
అనకాపల్లి: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశోద భార్గవి అనే విద్యార్థిని పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆమె గొంతు కోశాడు సాయి అనే ప్రేమోన్మాది. కాలేజీ అయిపోగానే ఇంటికెళ్లేందుకు రోడ్డుపై వేచిఉన్న సమయంలో సాయి కత్తితో వచ్చి భార్గవిపై దాడి చేశాడు. స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సాయి దాడి చేయగానే రక్తపుమడుగులో కుప్పకూలింది భార్గవి.
భార్గవి రక్తపుమడుగులో పడి ఉండటం చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సమీప ఆస్పత్రికి భార్గవిని తీసుకెళ్లింది. ప్రస్తుతం భార్గవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే దాడి చేసిన సాయిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనకాపల్లి రైల్వేస్టేషన్కు సమీపంలో ఉండే సాయి జులాయి తిరుగుళ్లు తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా తనను ప్రేమించాల్సిందిగా భార్గవిని వేధించేవాడని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
ప్రేమోన్మాది సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదువుకునే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. పట్టపగలే ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణమని చెప్పారు. అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పిన స్థానికులు... ప్రభుత్వం భార్గవిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టపగలే భార్గవి పై దాడిని ఖండించాయి మహిళా సంఘాలు. ప్రభుత్వం కసాయి సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అని వెంటనే స్పందించి సాయి అనే ప్రేమోన్మాదిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని మహిళా సంఘాలు కోరాయి. ఇలాంటి తప్పు చేయాలంటే ప్రేమోన్మాదుల వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలని కోరాయి మహిళా సంఘాలు.