విశాఖ ఉక్కుపై ప్రధాని మోడీకి లేఖలు రాసిన చంద్రబాబు .. వైసీపీకి షాక్ ఇచ్చారుగా !!
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ వేదికగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దని కోరారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కనీసం మోడీకి లేఖ రాయలేదని చంద్రబాబు ని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చారు.

విశాఖ ఉక్కు కోసం మోడీకి రెండు లేఖలు రాసిన చంద్రబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి రెండు లేఖలు రాసినట్లుగా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఆర్టిఐ దరఖాస్తు పీఎంవో ఇన్/ ఆర్/ 21/ 00979 నంబరులో చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినట్లుగా వెల్లడించారు. ఆర్టిఏ దరఖాస్తుదారుడు ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు పిఎంఓ నుండి ఈ మేరకు సమాధానం లభించింది.

ఫిబ్రవరి 20 న ఒక లేఖ , మార్చి 10 న మరో లేఖ ... కనీసం లేఖ కూడా రాయలేదన్న వైసీపీ నేతలకు షాక్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 20వ తేదీన ఒకటి , మార్చి 10వ తేదీన మరొకటి ప్రధానికి చంద్రబాబు రెండు లేఖలు రాశారని, అవి నేరుగా పీఎంవోకు అందినట్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడించారు. విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ రాయలేదని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో, వైసీపీ నేతలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ఈ సమాచారం ద్వారా తెలుస్తుంది.

చంద్రబాబు లేఖ రాశారని చెప్పని టీడీపీ , రాస్తే మా ఒత్తిడి వల్లే అంటున్న వైసీపీ
అయితే పదేపదే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా ,చంద్రబాబు గాని, టిడిపి నాయకులు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాశాడన్న విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. అలా చెప్పకపోవడం వెనక కారణం ఏంటనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు లేఖ రాసి ఉంటే వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే, తమ ఒత్తిడి వల్లే లేఖ రాసినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖలు రాయడం మాత్రం వైసీపీ నేతలకు ఒకింత షాక్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications