Jagan సర్కార్ మెడకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు- విపక్షాల ట్రాప్- పార్టీలో భిన్నస్వరాలు
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తుండగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ ప్లాంట్ కొనుగోలుకు సిద్ధమవుతుందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ డిమా్ండ్ను తెరపైకి తీసుకురాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వం అవసరమైతే కొనుగోలు చేస్తుందని సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు.
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ మంటలు
వైజాగ్ స్టీల్ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు విశాఖలో కాక రేపుతోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి. ఇది అంతిమంగా వైసీపీ ఆధ్వర్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దంటూ సీఎం జగన్ తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయినా విపక్షాలు మాత్రం వైసీపీ సర్కారును టార్గెట్ చేయడం ఆపలేదు. విశాఖ ప్లాంట్ కాపాడుకోవడానికి రాజీనామాలు చేయాలని, లేదా ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వైజాగ్ స్టీల్ వాటాల కొనుగోలు
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండే. ఒకటి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతున్నందున అక్కడే లాబీయింగ్ చేసి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, రెండవది స్టీల్ ప్లాంట్లో వాటాలను తామే ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడం. అయితే ఇందులో రెండో ఆప్షన్తో పోలిస్తే మొదటి ఆప్షన్వైపు ప్రస్తుతం వైసీపీ సర్కారు మొగ్గుచూపుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో మాట్లాడతామని ఇప్పటికే స్దానిక వైసీపీ ఎంపీ సత్యనారాయణతో పాటు ఇతర నేతలు చెప్తున్నారు. అయితే తాజాగా వైసీపీ కీలక నేత, ఉత్తరాంధ్ర వ్యవహారాలు కూడా చూస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం అవసరమైతే వాటాల కొనుగోలుకు కూడా సిద్ధమైనట్లు ట్వీట్ చేశారు.
సాయిరెడ్డి వర్సెస్ అవంతి శ్రీనివాస్
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైతే వాటాల కొనుగోలు చేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. దీంతో కేంద్రం కాదంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాల కొనుగోలు చేసి స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని అంతా భావిస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన స్ధానిక మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం వాటాల కొనుగోలు డిమాండ్లను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాల కొనుగోలు చేస్తుందంటూ వస్తున్న వార్తలు రాజకీయంలో భాగమని, అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో వాటాల కొనుగోలుపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
వాటాల కొనుగోలుపై టీడీపీ ట్రాప్లో పడ్డారా ?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాటాల కొనుగోలు ప్రతిపాదన విషయంలో వైసీపీ సర్కార్ టీడీపీ ట్రాప్లో పడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే ప్రభుత్వమే వాటాల కొనుగోలు చేయలని కోరుతోంది. దీంతో సీఎం జగన్ కూడా ప్రధానికి రాసిన లేఖలో చివరి ఆప్షన్గా వాటాల కొనుగోలును ప్రస్తావించారా అన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే టీడీపీ ట్రాప్లో వైసీపీ పడిందని అనుకోవచ్చు.