ఈ ఉగాదికి కూడా సీఎం జగన్ తీరని కలగా విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు .. రీజన్స్ ఇవే !!
సీఎం జగన్ పరిపాలనా రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యాలని భావించి గత 2 సంవత్సరాలుగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . కానీ సీఎం జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనే కోరిక మాత్రం నెరవేరటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని తరలింపు ప్రక్రియకు బాలారిష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి .

ఈ ఉగాదికి కూడా నెరవేరని జగన్ కల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, రాష్ట్ర పరిపాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, రకరకాల కారణాలు పది అడుగులు వెనక్కి లాగుతున్నాయి. ఇక ఈ ఏడాది కూడా ఉగాదికి పరిపాలన రాజధాని తరలింపు ప్రక్రియ కొనసాగుతుందా అంటే అవకాశమే లేనట్టుగా కనిపిస్తుంది.

రాజధానికేసులు పెండింగ్ లో ఉండటమే కారణం
రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. జస్టిస్ జెకె మహేశ్వరి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రాజధాని కేసుల అంశం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపించింది. అయితే ఇప్పుడు ఆయన మారిపోవడం , ఆ తర్వాత ఆయన స్థానంలో అరూప్ గో స్వామి కొత్త సీజేగా రావడంతో రాజధాని కేసుల కథ మొదటికి వచ్చింది. హైకోర్టుకు వేసవి సెలవుల అనంతరం రాజధాని కేసులపై మే 3వ తేదీ నుండి వరుసగా విచారణ నిర్వహిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

మే 3 నుండి వరుసగా రాజధాని కేసుల విచారణ
ఇక ఏప్రిల్ రెండో వారంలో ని హైబ్రిడ్ విధానంలో విచారణ జరపాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. కాని కోర్టు మాత్రం మే 3వ తేదీ నుండి వరుసగా రాజధాని కేసుల విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఉగాదికి కూడా రాజధాని తరలింపు ప్రక్రియకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి.
అంతేకాదు విశాఖ లో రాజధాని తరలింపు సంబంధించిన పనులు ఊపందుకోకపోవటం, పూర్తిస్థాయిలో పాలనా వ్యవస్థను తరలించడానికి కార్యాలయాలు ఇంకా సిద్ధం కాకపోవడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి .

పూర్తి స్థాయిలో రెడీ కాని విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు
సచివాలయ ఉద్యోగులు అమరావతి నుండి విశాఖకు తరలి వచ్చి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలంటే ఉద్యోగులకు కావలసిన సరైన వసతి సదుపాయాలు, శాశ్వత భవనాలు కల్పన ఉండి తీరాలని ఏపీ సర్కార్ భావిస్తోంది . మరోవైపు శాశ్వత ప్రాతిపదికన రాజధాని ఏర్పాటు కోసం పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఈ ఏడాది రాజధాని తరలింపు లేనట్టే అని చెప్పడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. వైసీపీ మంత్రులు గత రెండేళ్ళు విశాఖకు త్వరలో పరిపాలనా రాజధాని మారుతుందని ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా తాజా పరిస్థితి ఉంది .
Recommended Video

మూడు రాజధానులు ప్రకటించిన నాటి నుండీ రాజధాని తరలింపు యత్నాలు .. జూన్ తర్వాతే రాజధాని తరలింపు?
సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి ఇప్పటివరకు రాజధాని తరలింపును వేగవంతం చేయాలని విశాఖ వేదికగా పరిపాలన సాగించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ ఏడు కూడా ఉగాదికి విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు ప్రక్రియ లేదని తెలుస్తుంది. మే నెలలో రాజధాని కేసులపై వరుసగా విచారణలు జరగనున్న కారణంగా, ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే జూన్ తర్వాతే రాజధాని తరలింపు సాధ్యమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications