విశాఖ కలెక్టర్గా గంధం చంద్రుడు?..సీఎంఓకు వినయ్ చంద్?: వైఎస్ జగన్ యంగ్ టీమ్
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించడం ద్వారా అక్కడి నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి భావిస్తోన్నారు. ఒక్కసారి విశాఖ నుంచి పరిపాలనను ఆరంభించిన తరువాత ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. యంగ్ టీమ్ను ఆయన సిద్ధం చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది.

గంధం చంద్రుడు విశాఖకు..
ఇందులో భాగంగా- ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కొందరు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. గ్రేటర్ విశాఖ పరిధిలోని జోనల్ కమిషనర్లుగా ఐఎఎస్ అధికారులను నియమించింది. తాజాగా- జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారుల బదిలీలను చేయడానికి సమాయాత్తమౌతోన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడును నియమించే అవకాశాలు ఉందనే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో విడుదల కావొచ్చని అంటోన్నారు.

పోస్టింగ్ కోసం వెయిటింగ్..
2010 బ్యాచ్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు సుదీర్ఘకాలం పాటు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కొద్దిరోజుల కిందటే ఆయనను ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్గా నియమించింది. ఆ వెంటనే- ఆ ఉత్తర్వుల్లో కూడా సవరణలు చేసింది. గంధం చంద్రుడి స్థానంలో గ్రామ/వార్డు సచివాలయాల డైరెక్టర్గా సగిలి షాన్ మోహన్ను బదిలీ చేసింది.
ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలంటూ ఆయనను ఆదేశించింది. దీనికి అనుగుణంగా జీఏడీలో రిపోర్ట్ చేసిన ఆయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్నారు..వెయిటింగ్లో ఉన్నారు. ఆయనను విశాఖకు బదిలీ చేయడానికే వెయిటింగ్లో ఉంచిందనే ప్రచారం ఉంది.

సీఎంఓకు వినయ్ చంద్
ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉంటోన్న వినయ్ చంద్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేస్తారని తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా మీద మంచి పట్టు ఉంది ఆయనకు. సీఎంఓలోకి తీసుకోవడం ద్వారా పరిపాలన రాజధానిగా బదలాయించిన తరువాత వినయ్ చంద్ సేవలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిట్యూషన్ కంపోనీ (ఈపీడీసీఎల్) సీఎండీగా కూడా వినయ్ చంద్ను బదిలీ చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఇదివరకు ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన నాగలక్ష్మిని ప్రభుత్వం అనంతపురం జిల్లా కలెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

యంగ్ టీమ్
అలాగే- ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న గుమ్మళ్ల సృజనను కూడా బదిలీ చేయొచ్చనే ప్రచారం ఉంది. ఆ స్థానంలో సృజన వంటి సమర్థురాలైన అధికారి దొరికితేనే అక్కడి నుంచి బదిలీ చేస్తారని తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలోకి కొత్త ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం నియమిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరంపై అవగాహన ఉన్న సృజనకు స్థానచలనం కల్పించకపోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలను బట్టి చూస్తోంటే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. యంగ్ ఐఎఎస్ టీమ్ను ఏర్పాటు చేసుకుంటున్నారనేది స్పష్టమౌతోంది.












Click it and Unblock the Notifications