5 రోజుల పాప.. కిడ్నాప్ కేసు ఛేజ్, తల్లి ఒడి చేరనున్న చిన్నారి..
కేజీహెచ్లో నాలుగు రోజుల పాప కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నాప్ అయిన పాప సేఫ్.. తల్లిదండ్రుల వద్దకు చేరనుంది. ఈ నెల 13వ తేదీన పుట్టిన ఆడ శిశువు నిన్న రాత్రి 7 గంటలకు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి 16 గంటల పాటు పేరంట్స్ ఆందోళన చెందారు. విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను పోలీసులు జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టడంతో కిడ్నాపర్లు దొరికారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు.

కారులో తరలిస్తుండగా..
కవిటి మండలం వరక గ్రామానికి చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను AP 39 TC 0726 నెంబర్ కారులో తరలిస్తుండగా హైవేపై పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి శ్రీకాకుళం ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు. పాపకు వైద్య పరీక్షలు చేసిన వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. పద్మనాభం మండలం రౌతుపాలానికి చెందిన అప్పాయమ్మ .. ఈనెల 13న కేజీహెచ్లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు వచ్చారు. నర్సు, ఆయాలా పాపను పరీక్షించాలన్నారు.

అలా అనుమానం..
అప్పాయమ్మకు అనుమానం వచ్చి తన బంధువులను పంపిస్తామని చెప్పింది. వారి అవసరం లేదంటూ పాపను బలవంతంగా తీసుకువెళ్లారు. సమయం దాటుతున్నా బిడ్డను తీసుకురాకపోవడంతో తల్లి కంగారుపడింది. పాపను తీసుకెళ్లిపోయారని కేకలు వేసింది. ఆసుపత్రి సిబ్బంది విషయం తెలుసుకుని...పాప కిడ్నాప్ అయినట్లు పోలీసులకు సమాచారం అందించారు. కేజీహెచ్లో ఉదయం నుంచి పాప తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. దీంతో పాప కిడ్నాప్ వెనుక సిబ్బంది హస్తముంటే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలి స్పష్టంచేశారు.

వారి హస్తం లేదులే...
డీసీపీ గౌతమి శాలి కేజీహెచ్ గైనిక్వార్డుకు వచ్చి.. ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ, పాప బంధువులను విచారించారు. సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా ఒక మహిళ హడావుడిగా బిడ్డను తీసుకువెళ్తున్నట్లు రికార్డయింది. గైనిక్ వార్డు నుంచి పాపను తీసుకెళ్లి.. కేజీహెచ్ ఔట్ గేట్ వద్ద .. కిడ్నాపర్లు ఆటో ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. గురుద్వార వద్దకు చేరుకోగానే ..ఓ మహిళ ఆటో దిగినట్లు తేల్చారు. చివరికి టవర్ లొకేషన్ ఆధారంగా శ్రీకాకుళం జిల్లా జర్జంగిలో కిడ్నాపర్లను ట్రేస్ చేశారు.పాప ఆచూకీ లభ్యం అవడంతో తండ్రి శంకర్రావు ఆనందం వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. పోలీసులు సెల్ఫోన్లో ఫోటోను చూపించడంతో తమ మనవరాలిని గుర్తుపట్టామని అమ్మమ్మ వివరించారు.












Click it and Unblock the Notifications