మోదీకి అన్ని విషయాలూ చెప్పా - ఏపీకి మంచిరోజులు వస్తాయ్..!!
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విశాఖపట్నం పర్యటన ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు వ్యవహారాలు.. వంటి అంశాల మధ్య విశాఖపట్నానికి రాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో- ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాబోతోండటం అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకొంది.
ఆలస్యంగా మోదీ పర్యటన..
మోదీ పర్యటన కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తమిళనాడులోని మధురై నుంచి విశాఖకు బయలుదేరాల్సిన ప్రత్యేక విమానం- వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యంగా బయలుదేరింది. ప్రస్తుతం తమిళనాడు దక్షిణ ప్రాంతం, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విమానం టేకాఫ్ తీసుకోవడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఈ జాప్యం ఏర్పడింది.
రోడ్ షోలో..
రాత్రి 8:15 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి సెంటర్ నుంచి రోడ్ షోగా ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళకు బయలుదేరి వెళ్లారు. ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఆయన రోడ్ షో సాగింది. ఈ సందర్భంగా వందలాదిమంది విశాఖవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఒక పక్కన నిల్చుని మోదీకి జైకొట్టారు. కటౌట్లను ప్రదర్శించారు.
పవన్తో భేటీ..
ఐఎన్ఎస్ చోళకు చేరుకున్న వెంటనే ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ నాయకుల కంటే ముందే పవన్ కల్యాణ్కు అపాయింట్ ఇచ్చారు మోదీ. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పని చేయాల్సి ఉంటుందనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పవన్ కల్యాణ్కు మోదీ కీలక హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.
కోర్ కమిటీతో..
తన పర్యటన ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో- మరింత జాప్యానికి అవకాశం ఇవ్వలేదాయన. వచ్చీరాగానే తన తన తదుపరి సమావేశాలను చేపట్టారు. ముందుగా పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. ఏకాంతంగా సమావేశం అయ్యారు. అనంతరం బీజేపీ కోర్ కమిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది.
మోదీతో భేటీపై..
ప్రధాని మోదీతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని విశాఖ పర్యటనను పురస్కరించుకుని రెండు రోజుల కిందటే తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. విశాఖ పర్యటనలో ప్రధానిని కలవాలని పీఎంఓ అధికారులు సూచించినట్లు చెప్పారు. ఇదివరకు తాను ఢిల్లీ వెళ్లినప్పటికీ.. ప్రధానిని ఎప్పుడూ కలుసుకోలేదని వివరించారు. 2014లో పార్టీ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లానని గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని వ్యాఖ్యానించారు.
అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు..
ప్రధాని మోదీ తనను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని విషయాలను ఆయనకు తెలియజేశానని అన్నారు. మోదీతో తాను భేటీ కావడం- భవిష్యత్తులో అనేక పరిణామాలకు నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. ఏపీకి మంచి రోజులు వస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు. మోదీతో తన సమావేశం అలాంటి మంచి రోజులను తీసుకొస్తుందని చెప్పారు.